వాషింగ్టన్: ఇటీవల అమెరికాలోని భారతీయ విద్యార్థులపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై శ్వేతసౌధం(White House) స్పందించింది. భారతీయులు, భారతీయ విద్యార్థులపై దాడుల్ని నిలువరించేందుకు బైడెన్ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వైట్హౌజ్ వెల్లడించింది. నేషనల్ సెక్యూర్టీ కౌన్సిల్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ దీనిపై ప్రకటన చేశారు. హింసకు ఎటువంటి చోటు లేదని, ఎవర్నీ క్షమించేదిలేదని, మతం, వర్ణం ఆధారంగా జరిగే హింసను క్షమించబోమన్నారు. అమెరికాలో ఆ రకమైన హింసకు ఏమాత్రం స్థానం లేదన్నారు. భారతీయులపై జరిగే దాడుల్ని నిలువరించేందుకు బైడెన్ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోందని, అన్ని రాష్ట్రాలు, స్థానిక అధికారులతో ఈ అంశాన్ని చర్చిస్తున్నామని కిర్బీ తెలిపారు.