ఇస్లామాబాద్, జనవరి 16: అణు దేశమైన పాకిస్థాన్ అప్పుల కోసం దేబిరించడం నిజంగా అవమానకరమని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఆర్థిక కష్టాలతో అల్లాడుతూ రోజురోజుకు దిగజారుతున్న దేశ పరిస్థితి, కొత్త రుణాలు లభ్యం కాని దైన్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పీఎఎస్) ప్రొబేషనరీ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్లో మాట్లాడుతూ కొత్త రుణాల కోసం వివిధ దేశాల వారిని అభ్యర్థించడం తనకు సిగ్గుగా ఉందని అన్నారు. పాకిస్థాన్ ప్రస్తుత ఆర్థిక సవాళ్ల నుంచి బయటపడటానికి అప్పులు చేయడం తగిన పరిష్కారం కాదని, మనం తీసుకున్న రుణ బకాయిలను మళ్లీ చెల్లించాల్సి ఉంటుందన్న విషయం మరువరాదన్నారు. అయితే ఈ కష్ట సమయంలో సౌదీ అరేబియా తమకు అందిస్తున్న ఆర్థిక సహకారంపై కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఇటీవల తాను ఆ దేశంలో జరిపిన పర్యటన సందర్భంగా పాకిస్థాన్కు మరో బిలియన్ యూఎస్ డాలర్ల రుణాన్ని ఇవ్వడానికి ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అంగీకరించారన్నారు.