లండన్, ఫిబ్రవరి 2: ప్రధాని మోదీపై బీబీసీ ఇటీవల ప్రసారం చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీపై యూకే ప్రభుత్వం స్పందించింది. దాని చర్యను సమర్థించిన యూకే.. భావ వ్యక్తీకరణలో బీబీసీ పూర్తి స్వతంత్రత కలిగిన మీడియా సంస్థ అని వ్యాఖ్యానించింది. ఇది తమ దేశాల మైత్రిపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. భారత్తో తమ సంబంధాలు పూర్తి స్థాయిలో కొనసాగుతాయని స్పష్టం చేసింది.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రతినిధి ఎకోయడ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తమ దేశ విదేశీ శాఖ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ పార్లమెంట్లో చేసిన ప్రకటన గురించి వివరించారు. గత వారం పార్లమెంట్లో ఒక సభ్యుడు దీనిపై ప్రశ్నించారని వెల్లడించారు. ‘బీబీసీ అనేది ఒక స్వతంత్ర మీడియా సంస్థ. అది తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలదు. అయితే భారత్ తమకు అంతర్జాతీయంగా ముఖ్యమైన భాగస్వామి’ అని జేమ్స్ ప్రకటించారని వివరించారు. దానితో పాటు పలు అంశాలపై భారత హై కమిషనర్ విక్రమ్ దొరస్వామితో మాట్లాడినట్టు చెప్పారని పేర్కొన్నారు.