బాల్టిమోర్: అమెరికాలోని బాల్టిమోర్లోని (Baltimore Bridge) పటాప్స్కో నదిలో ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన కుప్పకూలింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో వంతెన పైనుంచి ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. దీంతో సుమారు 20 మంది నీటమునిగారు. గల్లంతైన వారికోసం ఆ ప్రాంతంలో గజఈతగాళ్లు గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో 7.6 మీటర్ల (25 ఫీట్లు) లోతులో మునిగిపోయిన ఓ ట్రక్కు నుంచి రెండు మృతదేహాలను వెలికితీశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నామని యూఎస్ కోస్ట్గార్డ్ అధికారులు వెల్లడించారు. మృతులు 35 ఏండ్లు, 26 ఏండ్ల వయస్సు కలిగి ఉన్నారని చెప్పారు. బాధితులంతా మెక్సికో, గ్వాటేమాల, హోండురస్, ఎల్సాల్విడార్కు చెంచినవారని తెలిపారు.
బాల్టిమోర్లోని పటాప్స్కో నదిలో మంగళవారం తెల్లవారు జామున ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన పేకమేడలా కూలిపోయిన విషయం తెలిసిందే. వంతెన పిల్లర్ను నౌక ఢీకొట్టడంతో వంతెన కూలిపోతున్న దృశ్యాలు వైరల్గా మారాయి.వంతెనను ఢీకొట్టింది సింగపూర్కు చెందిన సినెర్జీ మెరైన్ గ్రూప్నకు చెందిన ‘డాలీ’ అనే నౌకగా గుర్తించారు. ఇది బాల్టిమోర్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నౌకలో ఇద్దరు పైలెట్లు సహా 22 మంది సిబ్బంది ఉండగా అందరూ భారతీయులేనని సినెర్జీ మెరైన్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నారు.