సిడ్నీ: ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో బాధపడుతుంటే ఆస్ట్రేలియాను మాత్రం కరోనాతోపాటు ఎలుకలు కూడా వేధిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాలు ఎలుకల సమస్యతో బెంబేలెత్తుతున్నాయి. ముఖ్యంగా న్యూసౌత్వేల్స్లో లక్షల సంఖ్యలో ఎలుకలు పంటలపై, ఆవాసాలపై దాడి చేసి భారీగా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. దాంతో న్యూసౌత్వేల్స్ వాసులు ఈ ఎలుకల బెడదతో విసిగిపోతున్నారు.
ఎలుకలతో ఏ కొత్త మహమ్మారి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అందుకే భారత్ నుంచి ఎలుకలను చంపే బ్రొమాడియోలోన్ అనే విషాన్ని దిగుమతి చేసుకోవాలని న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎలుకల మందును గతంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలుకల దాడిని ఆపడానికి ఆ నిషేధిత మందే విరుగుడుగా భావిస్తున్నది. అందుకే ఐదు వేల లీటర్ల బ్రొమాడియోలోన్ను తమకు ఎగుమతి చేయాలని న్యూసౌత్వేల్స్ ప్రభుత్వం భారత్ను కోరింది.