నైపితా: మయన్మార్ నేత ఆంగ్సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. అక్రమ రీతిలో వాకీటాకీలు కలిగి ఉన్న కేసులో ఆమెకు ఈ శిక్షను వేశారు. కోవిడ్19 నిబంధనలు కూడా అతిక్రమించినట్లు సూకీపై ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్లో సైన్యం ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సూకీని నిర్బంధించారు. అయితే డిసెంబర్లోనే ఓ కేసులో సూకీని దోషిగా నిర్ధారించారు. ఆమెపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ప్రభుత్వ పాలనను సైన్యం హస్తగతం చేసుకున్న రోజునే.. జనరల్ మిన్ ఆంగ్ హయింగ్ నేతృత్వంలోని సైనిక దళాలు ఆంగ్సాన్ సూకీ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆ సమయంలో సూకీ ఇంట్లో వాకీటాకీ డివైస్లను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని నైపితాలో ఇవాళ ఈ కేసులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణ సమయంలో మీడియాను అనుమతించలేదు. సూకీ లాయర్లను కూడా మీడియాకు దూరంగా ఉంచారు. ఇటీవల ఓ కేసులో రెండేళ్ల పాటు సూకీకి శిక్ష పడింది. దీంతో మొత్తం జైలు శిక్ష కాలం ఆరేళ్లకు చేరింది.