టెహ్రాన్/ టెల్ అవీవ్: పశ్చిమాసియా రగు లుతూనే ఉన్నది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయగా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడింది. శనివారం నాడు ఇచ్చిన మాటను తప్పిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ అరబ్ దేశాలపై దాడులను కొనసాగించారు. పైగా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై తమ దాడులను మరింత ముమ్మరం చేస్తామని ఆయన ఆదివారం ప్రకటించారు. దీంతో తీవ్రస్థాయిలో దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నది.
బహ్రెయిన్లోని నేవీ ఫ్లీట్పై దాడి
బహ్రెయిన్లోని మనామాలో ఉన్న జుఫైర్ జిల్లాలోని యూఎస్ నేవీకి చెందిన ఐదవ నౌకాదళంపై ఇరాన్ భారీ దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది అమెరికా సైనికులు మరణించినట్టు టెహ్రాన్ టైమ్స్ వెల్లడించింది. మనామా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ నౌకాదళం హెడ్క్వార్టర్స్పై ఇరాన్ నేరుగా క్షిపణి, డ్రోన్తో దాడి చేసింది. బహ్రెయిన్ స్థావరాన్ని రక్షించే పనిలో పేట్రియాట్ పీఏసీ-3 వ్యవస్థలు ఉన్నప్పటికీ ఈ దాడి ప్రాంతీయ వైమానిక రక్షణ ప్రభావం గురించి అత్యవసర ప్రశ్నలను లేవనెత్తింది.
మంటల్లో కువైట్ సోషల్ సెక్యూరిటీ టవర్
కువైట్లోని సోషల్ సెక్యూరిటీ టవర్పై ఇరాన్ దాడి చేయడంతో అది మంటల్లో చిక్కుకుంది. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ (పీఐఎఫ్ఎస్ఎస్) భవనంపై డ్రోన్తో దాడి చేయడంతో పై అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. కువైట్ ఎయిర్పోర్టులోని చమురు ట్యాంక్లు లక్ష్యంగా 15 డ్రోన్లతో ఇరాన్ జరిపిన దాడిని సౌదీ అరేబియా అడ్డుకుంది. అంతకు ముందు రోజు కూడా 10 బాలిస్టిక్, రెండు క్రూయిజ్ క్షిపణులతో ఇరాన్ తమపై దాడి చేసిందని, అయితే అందులో చాలా ఆయుధాలను అడ్డుకున్నామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా మిలిటరీ సూచనల మేరకు తమ క్రూడ్ ఉత్పత్తిని నిలిపివేశామని కువైట్ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. అలాగే ఆగ్నేయంలో ఉన్న షాయబ్ ఆయిల్ క్షేత్రంపై దాడికి ప్రయత్నించిన 17 డ్రోన్లను కూడా అడ్డుకున్నామన్నారు. అలాగే తాము ఇప్పటివరకు 92 క్షిపణులు, 151 డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశామని బహ్రెయిన్ తెలిపింది. తమ దేశంలోని ఒక నీటి శుద్ధి ప్లాంట్పై ఇరాన్ ఆదివారం దాడిచేసిందని బహ్రెయిన్ ఆరోపించింది.
టెల్ అవీవ్, బీర్షేలపై దాడి
ఇజ్రాయెల్లోని టెల్అవీవ్, బీర్షేవా నగరాలతో పాటు జోర్డాన్ సమీపంలోని ఎయిర్బేస్పై ఇరాన్ దాడిచేసింది. ఇజ్రాయెల్లోని హైఫాలో ఉన్న అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారంపై తమ క్షిపణులు దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది.
సౌదీలో భారతీయుడు మృతి!
సౌదీ అరేబియాపై మిలిటరీ దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిని గుర్తుతెలియని చోట నుంచి జరిగిన దాడిగా సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ పేర్కొన్నది. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, దక్షిణ రియాద్లోని అల్ ఖార్జ్లో నివాస ప్రాంతాలపై జరిగిన మిలిటరీ ప్రొజక్టైల్ దాడిలో భారత్, బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు పౌరులు చనిపోయారని తెలిపింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేపడుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన ప్రకటనలో ఇరాన్ పేరును సౌదీ ప్రస్తావించలేదు. సౌదీలోని అల్-ఖార్జ్ గవర్నరేట్ భారీ వైమానిక స్థావరానికి నిలయం.