వాషింగ్టన్: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. సుమారు 50 మందికిపైగా మరణించి ఉంటారని సమాచారం. ఆగ్నేయ రాష్ట్రం కెంటకీతోపాటు పలు ఇతర రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు టోర్నడోలు విరుచుకుపడ్డాయి. దీంతో పలు ఇండ్ల, భవనాల పైకప్పులు ఎగిరిపోయాయి. కొన్ని చోట్ల కేవలం గోడలు మాత్రమే మిగిలాయి.
ప్రధానంగా కెంటకీలోని పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగిందని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు. సుమారు 50 మందికిపైగా ప్రజలు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ సంఖ్య వంద వరకు పెరిగే అవకాశమున్నదని అన్నారు. కెంటకీ చరిత్రలోనే అత్యంత దారుణ టోర్నడో బీభత్సంగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని కోరారు.
మరోవైపు ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అమెజాన్ భారీ గిడ్డంగిని గాలి తుఫాను చీల్చింది. సుమారు వంద కార్మికులు అందులో చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాగా, టోర్నడో సృష్టించిన బీభత్స దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.