నీళ్లే కాదు.. శరీరం కూడా గడ్డ కట్టుకుపోతుందేమో అనిపించేలా ఉష్ణోగ్రతలు జీరో దాటి మైనస్ల్లో పడిపోయాయి. రోడ్లపై, నివాసాలు, వాహనాలపై ఇలా ఎక్కడ చూసినా మంచుదిబ్బలు. ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. పదుల సంఖ్యలో మరణాలు. విద్యుత్తు అంతరాయంతో లక్షల ఇండ్లకు విద్యుత్తు సరఫరా కట్. అమెరికాలో బాంబు సైక్లోన్ సృష్టిస్తున్న భయానక పరిస్థితి ఇది.
వాషింగ్టన్, డిసెంబర్ 27: ‘బాంబు సైక్లోన్’గా పిలిచే మంచు తుఫాను ధాటికి అమెరికా వణికిపోతున్నది. అమెరికాలో ఇప్పటికే 60 మంది చనిపోయినట్టు సమాచారం. ఈ భయంకరమైన మంచు తుఫాను మరో వారం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 8 నుంచి మైనస్ 48 డిగ్రీల వరకు పడిపోయాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు భయానకంగా ఉన్నాయి. రహదారులపై మంచు దిబ్బల్లా పేరుకుపోయింది. మరోవైపు అమెరికాలో పది రాష్ర్టాల్లో బైడెన్ ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. వీటిలో న్యూయార్క్, మిషిగాన్, మిన్నెసోటా, మాంటెన్నా, ఐయోవా, ఇండియానా, విస్కిన్సన్, నార్త్ డకోటా, సౌత్ డకోటా, ఐయోవా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
లక్షల ఇండ్లకు విద్యుత్తు కట్
మంచు కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లక్షల మంది ఇండ్లకు విద్యుత్తు లేక ఇక్కట్లు పడుతున్నారు. ఒక దశలో 17 లక్షల మందికి విద్యుత్తు సరఫరా ఆగిపోయింది.
న్యూజెర్సీలో గుంటూరు దంపతుల మృతి
మంచు తుఫాను కారణంగా న్యూజెర్సీలోని అరిజోనాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన దంపతులు మరణించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన మద్దన నారాయణ, భార్య హరిత, ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్లారు. ఓ ఐస్లేక్ వద్ద ఫొటోలు దిగుతుండగా, ఐస్గడ్డ ఒక్కసారిగా కుంగిపోవడంతో ఐస్లేక్ కింది భాగంలో చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్లో హరిత మృతదేహం లభించగా, నారాయణ మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఒడ్డునే ఉన్నారు.