ఇస్తాంబుల్: టర్కీ కేంద్రంగా పెను భూకంపం నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ భూకంపం వల్ల టర్కీ, సిరియా దేశాల్లో ఇప్పటికే సుమారు 600 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య దాదాపు పది వేలకు చేరే అవకాశం ఉన్నట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. దక్షిణ టర్కీలో 7.8 తీవ్రతతో ఇవాళ తెల్లవారుజామున అత్యంత శక్తివంతమైన భూకంపం నమోదు అయిన విషయం తెలిసిందే.
భూకంపం వల్ల మరణాల సంఖ్య 47 శాతం వెయ్యి నుంచి పది వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు యూఎస్జీఎస్ పేర్కొన్నది. ఇక 27 శాతం మరణాల సంఖ్య వంద నుంచి వెయ్యి మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు యూఎస్జీఎస్ తెలిపింది. మరణాల సంఖ్య 20 శాతం వరకు పది వేల నుంచి లక్ష మధ్య ఉండే ఛాన్సు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే పేర్కొన్నది.
ఈ ప్రాంతంలో వచ్చిన భూకంపాల చరిత్ర ఆధారంగా యూఎస్జీఎస్ ఈ అంచనా వేస్తోంది. షేకింగ్ ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో ఉండే జనాభా ఆధారంగా కూడా ఈ లెక్క వేయనున్నారు. అత్యంత ప్రభావానికి గురైన ప్రాంతంలో ఉన్న బిల్డింగ్ల ఆధారంగా కూడా మరణాల సంఖ్యను అంచనా వేయనున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండే ఛాన్సు ఉందని, నష్టం కూడా విస్తృత స్థాయిలో ఉంటుందని, ఇంకా ఆ భూకంప ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నట్లు యూఎస్జీఎస్ తెలిపింది.
తాజా భూకంపం వల్ల ఆర్ధిక నష్టం బిలియన్ డాలర్ నుంచి పది బిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నష్టం మొత్తం టర్కీ జీడీపీలో రెండు శాతం వరకు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.