రోమ్, మే 21: ఇటలీ పరిశోధకులు కనుగొన్న సరికొత్త సాంకేతికత కృత్రిమ అవయవాలు ఉన్నవారికి వరంగా మారనున్నది. ఈపీఎఫ్ఎల్, శాంటా అన్న స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, సెంట్రో ప్రొటెసీ ఇనాయిల్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు జరిగాయి. సిల్వెస్ట్రో మైకెరా, సోలైమాన్ షోకుర్ ఈ పరిశోధలనలకు నేతృత్వం వహించారు. బయోనిక్ టెక్నాలజీగా పిలిచే ఈ సాంకేతికత సాయంతో కృత్రిమ చేతులు ఉన్నవారు చల్లదనం, వేడిని అనుభూతి చెందవచ్చు. ఇటలీలోని బోలోగ్నాలో 27 మందిపై ఈ పరిశోధన నిర్వహించగా వీరిలో 17 మంది ఫలితాలపై సానుకూలంగా స్పందించారు. పరిశోధనల్లో భాగంగా మినీ టచ్ పేరిట కొత్త పరికరాన్ని కనుగొన్నారు. దీన్ని కృత్రిమ అవయవానికి అమర్చితే థర్మల్ ఫీడ్ బ్యాక్ను అందిస్తుంది. ఏదైనా వస్తువును తాకినప్పుడు ఆ వస్తువు ఉష్ణోగ్రతను ఈ పరికరం సదరు వ్యక్తికి తెలియజేస్తుంది. ఈ పరికరంపై మరింత పరిశోధనలు చేసి కృత్రిమ అవయవంలో చేర్చేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.