కేప్ కెనరవల్: నాసా ఇవాళ ప్రతిష్టాత్మక మిషన్ చేపట్టింది. ఆర్టెమిస్-2(Artemis II) ప్రాజెక్టులో భాగంగా నలుగురు వ్యోమగాములు రోదసిలోకి వెళ్తున్నారు. ఆ నలుగురూ చంద్రుడిని చుట్టిరానున్నారు. అయితే గతంలో చంద్రుడి మీదకు వ్యోమగాములు వెళ్లినా.. ఇప్పుడు వెళ్లే వ్యోమగాములు జాబిలిని దాటి కాస్త ఎక్కువ దూరమే వెళ్లనున్నారు. చంద్రుడి చుట్టూ సర్కిల్ కొట్టే ప్రక్రియలో .. అవతలి వైపు ఎక్కువ దూరం ప్రయాణించనున్నారు. చంద్రుడికి అవతలివైపు సుమారు 6400 మైళ్లు అంటే సుమారు 10,299 కిలోమీటర్ల దూరం ఆర్టెమిస్ వెళ్లనున్నది. భూమికి ఎప్పుడూ మరో వైపు ఉన్నట్లుగా ఉండే ఆ ప్రాంతానికి ఆస్ట్రోనాట్స్ వెళ్లడం తొలిసారి అవుతుంది. అయితే ఈ దూరాన్ని చుట్టిరావలంటే వ్యోమగాములకు సుమారు మూడు గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఆ సమయంలో వ్యోమగాములు చాలా కీలకమైన అంశాలను సేకరించనున్నారు. చంద్రుడి అవతలి వైపు ప్రాంతాన్ని విశ్లేషించనున్నారు. వాటి ఫోటోలను తీయనున్నారు. చంద్రుడి భౌగోళిక ఫీచర్లను స్టడీ చేయనున్నారు. అక్కడ ఉన్న అగాధలను కూడా విశ్లేషించనున్నారు. అనాది కాలం నాటి లావాను కూడా అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి దక్షిణ ద్రువ ప్రాంతంలో భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలకు తాజా మిషన్ ఓ దిక్సూచి కానున్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆస్ట్రోనాట్స్ ఆరోగ్య పరిస్థితిని కూడా నాసా స్టడీ చేయనున్నది.
సుదూర ప్రయాణం వల్ల కలిగే శారీరక మార్పులపై అధ్యయనం చేస్తారు. మార్స్ గ్రహానికి ట్రావెల్ చేయాలంటే కలిగే మార్పులపై కూడా నాసా శాస్త్రవేత్తలు స్టడీ చేయనున్నారు. ఒకవేళ ఈ ట్రిప్లో కనుక ఆర్టెమిస్ సిబ్బంది సురక్షితంగా చంద్రుడిని చుట్టి వస్తే, అప్పుడు నాసా భవిష్యత్తులో చేపట్టబోయే ఆర్టెమిస్-4, 5, ప్రాజెక్టులు కీలకం అవుతాయి. ఆ మిషన్స్ ద్వారా చంద్రుడిపై మనుషుల్ని దింపే ఆలోచనలో నాసా ఉన్నది. 2028లో లూనార్ ల్యాండింగ్ చేపట్టాలని నాసా భావిస్తోంది.