న్యూఢిల్లీ: ఆర్టెమిస్-2(Artemis II)లో చంద్రుడిని చుట్టివచ్చిన వ్యోమగాములు ఇవాళ సురక్షితంగా భూమికి చేరుకున్నారు. 9 రోజుల జర్నీ అత్యంత విజయవంతంగా సాగింది. పసిఫిక్ మహా సముద్రంలో ఓరియన్ క్యాప్సూల్ దిగింది. తమ బృందం ఆరోగ్యవంతంగా ఉన్నట్లు కమాండర్ రీడ్ వైజ్మాన్ తెలిపారు. ఆర్టెమిస్ సిబ్బంది భూమికి చేరుకున్న నేపథ్యంలో నాసా రియాక్ట్ అయ్యింది. మానవ అంతరిక్ష పరిశోధనలో ఇప్పుడో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు పేర్కొన్నది. ఆర్టెమిస్లో ప్రయాణించిన నలుగురు వ్యోమగాములు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు. పసిఫిక్ సముద్రంలో దిగిన తర్వాత.. ఆ వ్యోమగాముల్ని అమెరికా నౌకలోకి తీసుకెళ్లారు. భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఆర్టెమిస్ సుమారు ఆరు నిమిషాల పాటు బ్లాకౌట్ ఎదుర్కొన్నది. ఏప్రిల్ ఒకటో తేదీన ఆర్టెమిస్ నింగికి ఎగిరింది. వ్యోమగాములు సుమారు 406,771 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చారు.
ఆర్టెమిస్ వ్యోమగాములకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంగ్రాట్స్ తెలిపారు. ట్రుత్ సోషల్లో ఆయన స్పందించారు. త్వరలోనే ఆ బృందాన్ని వైట్హౌజ్లో కలుసుకోనున్నట్లు చెప్పారు. ట్రిప్ మొత్తం అద్భుతమని, ల్యాండింగ్ పర్ఫెక్ట్గా సాగిందని, అమెరికా దేశాధ్యక్షుడిగా నేను ఇంత కన్నా గర్వపడేది ఏమీ లేదని, మళ్లీ ఇలాంటి ట్రిప్ చేద్దామని, ఇక తర్వాత అడుగు మార్స్పైనే అని ట్రుత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు. ఆర్టెమిస్లో ప్రయాణించిన వ్యోమగాముల్లో రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెర్మీ హన్సెన్ ఉన్నారు. ఓరియన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోకి సుమారు గంటకు 25000 మీటర్ల వేగంతో ప్రవేశించింది.ఆ తర్వాత దాని వేగం క్రమంగా 20 మీటర్లకు చేరుకున్నది. పారాచూట్ సహాయంతో ఆ క్యాప్సూల్.. కాలిఫోర్నియా తీరంలో దిగింది.
నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ అమిత్ క్షత్రియా మాట్లాడుతూ… ఆర్టెమిస్ మిషన్ అనుకున్నదానికన్నాఎక్కువే పర్ఫార్మ్ చేసిందన్నారు. ప్రపంచానికి ఇదో గిఫ్ట్ అన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్స్కు మూన్ బేస్ కావొచ్చు అన్నారు. మళ్లీ ఇలాంటి మిషన్స్ చేపట్టేందుకు నాసాకు కాన్ఫిడెన్స్ వచ్చిందని క్షత్రియా పేర్కొన్నారు. వ్యోమగాములతో అంతరిక్ష ప్రయాణం చేపట్టడమే పెద్ద లక్ష్యమని, ఆర్టెమిస్2 మిషన్ ఆ లక్ష్యాన్ని నిజం చేసిందన్నారు.