General Bajwa | గత 70 ఏండ్లుగా పాకిస్తాన్ దేశ రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటున్నది. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా అంగీకరించారు. జనరల్ కమర్ జావేద్ బజ్వా ఈ నెల 29 న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో బజ్వా చేసిన ప్రసంగం పాకిస్తాన్లో కలకలం రేపుతున్నది. ఇప్పటివరకు రాజకీయాల్లో సైన్యం మితిమీరిన జోక్యం చూశామని, ఇకముందు అలా జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఆర్మీపై ఉన్నదని బజ్వా అన్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని గతేడాది ఫిబ్రవరి నిర్ణయం తీసుకున్నట్లు బజ్వా వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా ఇమ్రాన్ఖాన్కు ఆయన పేరు లేవనెత్తకుండానే కొన్ని సలహాలిచ్చారు.
సైన్యం గురించి మాట్లాడేటప్పుడు పాకిస్తాన్ రాజకీయ నాయకులు తరచుగా నోరు జారుతున్నారని జనరల్ బజ్వా విచారం వ్యక్తం చేశారు. ఇకముందు మంచి పదాలను ఎన్నుకోవాలని కోరారు. ఇటీవలి కాలంలో సైన్యంపై రాజకీయ నేతలు వాడిన భాష అభ్యంతరకరంగా ఉన్నదని చెప్పారు. సైన్యం గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సైన్యంపై విమర్శలు చేసే సమయంలో స్వరం పెంచుతున్నారని మండిపడ్డారు. తన ప్రభుత్వం పడిపోవడంలో మిలిటరీ పాత్ర ఉన్నదని ఇమ్రాన్ఖాన్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
సైన్యం తప్పులు చేయడం లేదని తాను అనడం లేదని, ఈ తప్పుల్లో పాక్ రాజకీయ నేతలతో పాటు పౌర సమాజం పాత్ర కూడా ఉన్నదని జనరల్ బజ్వా పేర్కొన్నారు. కష్టతరమైన దశను ఎదుర్కొంటున్న మన దేశాన్ని కాపాడుకునేందుకు స్వార్ధం, అహంను పక్కన పెడదాం అని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని దేశాన్ని ఈ పరిస్థితి నుంచి బయటపడేయాలని సూచించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజంగా జరుగుతుంటాయని, వాటిని సీరియస్గా తీసుకుని దేశ ప్రజల క్షేమాన్ని పణంగా పెట్టొద్దని వేడుకున్నాడు. ఇలా ఉండగా, తాను పాల్గొంటున్న పత్రి ప్లాట్ఫాంపై ఇమ్రాన్ఖాన్పై జనరల్ బజ్వా తీవ్ర విమర్శలు చేస్తుండటాన్ని రాజకీయ పరిశీలకులు నిశితంగా గమనిస్తున్నారు.