వాషింగ్టన్, ఫిబ్రవరి 4: అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా గగనతలంపై నిఘా బెలూన్ల కలకలం వివాదం రేపుతున్నది. తాజాగా మరో చైనా నిఘా బెలూన్ను గుర్తించామని, ఇది లాటిన్ అమెరికా గగనతలంపై ఎగురుతున్నదని అమెరికా రక్షణ శాఖ శుక్రవారం వెల్లడించింది. ‘లాటిన్ అమెరికా గగనతలం మీదుగా ఓ బెలూన్ ప్రయాణిస్తున్నట్టు సమాచారం అందింది. అది చైనాకు చెందిన మరో నిఘా బెలూన్గా అంచనా వేస్తున్నాం. ప్రస్తుతానికి ఇంతకంటే సమాచారం తమ వద్ద లేదు’ అని పెంటగాన్ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైటర్ వెల్లడించారు. అమెరికాలో మోంటానా రాష్ట్రంలోని సున్నిత స్థావరాల గగనతలంపై నిఘా బెలూన్ను గుర్తించినట్టు పెంటగాన్ వర్గాలు గురువారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన చైనా పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకోవడం గమనార్హం. కాగా, మోంటాన్పై ఎగురుతున్న బెలూన్పై చైనా స్పందించింది. ఇది పౌర గగననౌక అని, దీన్ని వాతావరణ పరిశోధనల కోసం తామే ప్రయోగించామని, గాలుల ప్రభావంతో దారితప్పి వచ్చివుండొచ్చని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.