డమాస్కస్: పశ్చిమాసియాలో మరో యుద్ధం రాజుకుంటున్నది. దక్షిణ సిరియాలో డ్రూజ్ మతానికి చెందిన పౌరులపై సైనిక దాడులను వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ సైనిక దళాలు బుధవారం సిరియా రాజధాని డమాస్కస్లో అధ్యక్ష భవనంతోపాటు సైనిక ప్రధాన కార్యాలయం, రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయంపై ప్రత్యక్ష దాడులకు తెగబడ్డాయి. సెంట్రల్ డమాస్కస్లో సిరియా ప్రభుత్వ టీవీ భవనంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో లైవ్లో వార్తలు చదువుతున్న ఓ మహిళా న్యూస్ రీడర్ కెమెరాను వదిలి పరుగులు తీశారు.
సిరియా సైనిక బలగాలకు, మైనారిటీ డ్రూజ్ తిరుగుబాటు వర్గాలకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో దక్షిణ ప్రాంతంలోని స్వీడా నగరంలో బుధవారం మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. డ్రూజ్ పౌరులపై సిరియా సైన్యం జరుపుతున్న దాడులకు సమాధానంగా తాము వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) ప్రకటించాయి. తమ రాజకీయ నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే తాము దాడులు చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఉత్తర సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో తాము అప్రమత్తంగా ఉన్నామని పేర్కొంది. సిరియా రాజధాని డమాస్కస్పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు జరిపింది. సైనిక, రక్షణ మంత్రిత్వ శాఖల కేంద్ర కార్యాలయాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులలో ఒకరు మరణించగా, 18 మంది గాయపడినట్లు సిరియా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ తన సైనిక బలగాలను గాజా నుంచి సిరియా సరిహద్దులకు తరలిస్తున్నట్లు సైనిక అధికారి ఒకరు తెలిపారు.
దక్షిణ సిరియాలోని స్వీడా నగరంలో సైనిక దళాల కాన్వాయ్పై కూడా ఇజ్రాయెలీ సైన్యం వైమానిక దాడులు జరిపింది. సిరియాలో మూడవ అతి పెద్ద మతమైన డ్రూజ్ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలపై సిరియా సైన్యం చొరబడి మైనారిటీలపై దాడులు జరుపుతోంది. సిరియా సైన్యానికి, డ్రూజ్ తిరుగుబాటుదార్లకు మధ్య మంగళవారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైంది. డ్రూజ్ మైనారిటీలపై సిరియా బలగాలు దాడులు చేశాయి. దీంతో డ్రూజ్ మైనారిటీలను కాపాడేందుకు ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. తమ దేశంలోని భిన్న మతస్తులను పరిరక్షిస్తానని వాగ్దానం చేసిన సిరియా కొత్త నాయకుడు అహ్మద్ అల్ షరా.. డ్రూజ్ మతస్తులు, అలావైట్ తెగపై దాడులను నివారించడంలో విఫలం చెందారు. మార్చిలో మాజీ నియంత బషర్ అల్ అసద్కి చెందిన అలావైట్ తెగపై సిరియా సైన్యం విరుచుకుపడడంతో వందలాది మంది మరణించారు. ఏప్రిల్లో ప్రభుత్వ అనుకూల సాయుధ దళాలు, డ్రూజ్ తిరుగుబాటుదారుల మధ్య జరిగిన ఘర్షణలలో 100 మందికి పైగా మరణించారు. తాజాగా సిరియా సైన్యానికి, డ్రూజ్ తిరుగుబాటుదారులకు మధ్య మళ్లీ ఘర్షణలు జరుగుతున్నాయి. ఆయుధాలు వదిలిపెట్టాలని షరా ఇచ్చిన పిలుపు కారణంగా ఈ ఘర్షణలు తలెత్తినట్లు తెలుస్తోంది. కాగా, డమాస్కస్లో తమ హెచ్చరికలు ముగిసిపోయాయని, ఇక శక్తివంతమైన దాడులు ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతకు ముందు స్వీడా నుంచి సైనిక దళాలను ఉపసంహరించాలని, డ్రూజ్ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని కట్జ్ సిరియాలోని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇజ్రాయెల్లోని డ్రూజ్ ప్రజలతో తమకు గాఢమైన సోదర అనుబంధం ఉన్న కారణంగా వారికి హాని జరగకుండా చూసుకోవలసిన బాధ్యత తమకు ఉందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. సిరియాలోని డ్రూజ్ పౌరులతో తమకు చారిత్రక బంధం ఉందని కూడా తెలిపింది.
అరబ్ తెగకు చెందిన డ్రూజ్ మతస్తులు సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్లో వ్యాపించి ఉన్నారు. ఈజిప్టు సంతతికి చెందిన వీరు ఇస్లాంని పాటిస్తారు. మతమార్పిడిని, మతాంతర వివాహాన్ని వీరు అంగీకరించరు. 1967లో ఆరు రోజుల యుద్ధంలో సిరియా నుంచి చేజిక్కించుకున్న గోలన్ హైట్స్ పీఠభూమిలో 20,000 మందికిపైగా డ్రూజ్ ప్రజలు నివసిస్తున్నారు. 1981లో ఈ పీఠభూమి ఇజ్రాయెల్లో లాంఛనంగా విలీనమైంది. ఈ ప్రాంతంలో 25,000 మంది యూదు వలసదారులు కూడా నివసిస్తున్నారు. సిరియాలోని సువేదా ప్రావిన్సులో డ్రూజ్ మతస్తుల ప్రాబల్యం అధికం.