వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హత్యకు కుట్ర పన్నారు. ఈ కేసులో ఇరాక్కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. 52 ఏళ్ల షిహబ్ అహ్మద్ షిహబ్ ప్రస్తుతం అమెరికాలో రాజకీయ ఆశ్రయం పొందుతున్నారు. జార్జ్ బుష్ను చంపేందుకు నలుగురు ఇరాకీలను అమెరికా రప్పించే ప్రయత్నం చేసినట్లు ఆ వ్యక్తిపై అరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఓహియో కోర్టులో ఎఫ్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇరాకీ ఇంటెలిజెన్స్తో పాటు ఇస్లామిక్ స్టేట్లో పనిచేసిన వ్యక్తుల్ని తీసుకువచ్చే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. 2003లో ఇరాకీపై ఆక్రమణకు వెళ్లిన జార్జ్ బుష్ పట్ల షిహబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దాడి వల్ల వేలాది మంది ఇరాకీలు చనిపోయినట్లు ఆ వ్యక్తి ఆరోపించారు. ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూ బాకర్ అల్ బగ్దాదికి బంధువునని ఆ వ్యక్తి చెప్పుకున్నాడు. హత్యాయత్నం కేసులో షిహబ్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. డల్లాస్, టెక్సాస్లో ఉన్న బుష్ లొకేషన్లను షిహబ్ రెక్కీ వేసినట్లు తెలుస్తోంది. తుపాకులు, భద్రతా దళాల దుస్తులు, వాహనాలను ఎలా తెచ్చుకోవాలన్న దానిపై షిహబ్ ఆరా తీసినట్లు అనుమానిస్తున్నారు.