లాహోర్ : పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో దారుణం జరిగింది. అమెరికాకు చెందిన 21 ఏండ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. డీజీ ఖాన్ జిల్లాలోని హిల్ స్టేషన్ ఫోర్ట్ మాన్రోయ్లో జులై 17న యువతిని నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధిత యువతి.. టూరిస్ట్ వీసాపై ఏడు నెలల క్రితం పాకిస్తాన్కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఫేస్బుక్లో ముజామిల్ సిప్రా, అజాన్ ఖోషా అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. అయితే ఆదివారం రోజు ఫోర్ట్ మాన్రోయ్ సందర్శిద్దాం.. అక్కడికి రావాలని అమెరికా యువతిని వారిద్దరూ కోరారు. దీంతో ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత ఓ హోటల్లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక వీడియోను కూడా చిత్రీకరించి, ఆమెను బెదిరింపులకు గురి చేశారు.
తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముజామిల్ సిఫ్రాను పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.