వాషింగ్టన్, ఆగస్టు 28: కాబూల్లో తమ సైనికుల మరణాలకు ప్రతీకారంగా అమెరికా దాడికి దిగింది. అఫ్గానిస్థాన్లోని నంగాహర్లో ఇస్లామిక్ స్టేట్-ఖోరసాన్(ఐఎస్-కే) స్థావరాలపై శుక్రవారం డ్రోన్లతో దాడులు నిర్వహించింది. దాడుల్లో ఇద్దరు ఐఎస్ కీలకనేతలు హతమైనట్టు అమెరికా తెలిపింది. కాబూల్ ఉగ్రదాడుల సూత్రధారి కూడా ఇందులో ఉన్నట్టు భావిస్తున్నారు. దాడిలో సామా న్య పౌరులెవరూ చనిపో లేదని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి బిల్ అర్బన్ తెలిపారు. కాబూల్ దాడులకు బాధ్యులు మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించిన గంటల్లోనే ఈ దాడులు జరుపడం విశేషం.
మాటలు వద్దు
తాలిబన్లను దౌత్య పరంగా ఇప్పుడే గుర్తించబోమని అమెరికా స్పష్టం చేసింది. వారు ‘మాటలు మాని, తాము ఇచ్చిన హామీలను చేతల్లో చూపించాలి’ అని పేర్కొన్నది. అప్పటివరకు అమెరికా గానీ, అమెరికా మిత్రపక్షాలు గానీ తాలిబన్లను గుర్తించబోవని తెలిపింది. అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తాలిబన్లు ప్రభుత్వం చేపట్టాక ఆ దేశానికి యూఎన్లో చోటు ఉంటుందా.. అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు.