న్యూయార్క్: ఆర్థిక మాద్యం, ఖర్చులు తగ్గించుకోవాలనే సాకుతో ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చేరింది. కార్పొరేట్, టెక్నాలజీ విభాగాల్లో సుమారు 10 వేల మంది ఉద్యోగులను తీసేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిసిందే. మరో వారంలో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అమెరికా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట యూఎస్లోని ఉద్యోగులతో ఇది షురూ అవుతుందని వెల్లడించాయి.
కాలిఫోర్నియాలోని వివిధ సెంటర్లలో ఉన్న 260 మంది డాటా సైంటిస్టులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఇతర కార్పొరేట్ వర్కర్లను తొలగించనున్నట్లు స్థానిక అధికారులకు కంపెనీ సమాచారం అందించింది. ఇది జనవరి 17 నుంచి ప్రారంభం కానుందని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని టీమ్లు, ప్రోగ్రామ్స్లను తొలగించాలని, మరికొందరి సేవలను తగ్గించుకోవాలని నిర్ణయించామని హార్డ్వేర్ చీఫ్ డేవ్ లింప్ ఉద్యోగులకు రాసిన మెమోలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్లో 10 లక్షల 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఖర్చుల నియంత్రణపై దృష్టి పెట్టిన కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నాయి. గ్లోబల్ సోషల్ మీడియా, టెక్నాలజీ, ఈ-కామర్స్ దిగ్గజాలన్నీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం సాకుతో ఎడాపెడా ఉద్యోగ కోతలకు దిగుతున్నాయి. మొదట ఉద్యోగాల తొలగింపు ట్విట్టర్ ప్రారంభమైంది. దానిని మెటా (ఫేస్బుక్), స్నాప్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రధాన సంస్థలు కొనసాగిస్తున్నాయి. గత వారం ట్విట్టర్ తన హెడ్ కౌంట్ను సగానికి తగ్గించగా, ఆ తర్వాత మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా అమెజాన్ కూడా ఈ కంపెనీల సరసన చేరింది. ఇలా ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకుంటామని వరుస ప్రకటనలు చేస్తుండటం అటు జాబ్ మార్కెట్లో, ఇటు కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.