ఖార్టూమ్: ఆఫ్రికా దేశమైన సూడాన్ (Sudan) సైన్యం, పారామిలిటరీ మధ్య ఘర్షణతో అట్టుకుతున్నది. రెండు దళాలకు చెందిన అధిపతుల మధ్య విభేదాలతో (Rival generals) దేశం నరక కూపంగా మారిపోతున్నది. గత 12 వారాలుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా పశ్చిమ ఒండుర్మాన్పై (Omdurman) సైన్యం జరిపిన వైమానిక దాడిలో (Air strike) 22 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. రాజధాని ఖార్టూమ్ (Khartoum) జంటగనరమైన ఒండుర్మన్, బహ్రీలలో ఏప్రిల్లో జరిగిన పోరాటంలో పారామిలిటరీ దళాలు ఆధిపత్యం చెలాయించాయి. దీంతో సైన్యం వైమానిక దాడులు జరుపుతున్నది.
గత నెలలో ఖార్టూమ్పై జరిగిన వైమానిక దాడిలో సుమారు 17 మంది చనిపోయారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. కాగా, ఒండుర్మన్లోని నివాస ప్రాంతాలపై సైన్యం వైమానిక దాడులు చేయడంతోనే ఎక్కువ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవిస్తున్నదని పారామిలిటరీ బలగాలు ఆరోపిస్తున్నాయి.
రెండు దళాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఇప్పటివరకు కనీసం 1,133 మంది మరణించారు. రాజధానితోపాటు కోర్డోఫాన్, డార్ఫర్ ప్రాంతాల్లో కూడా ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది పొరుగు దేశాలకు వలసవెళ్లారు.