రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల కోసం తాము మూడు వందే మాతరం మిషన్ ఫ్లైట్లను ఉక్రెయిన్కు పంపుతున్నట్లు ఎయిరిండియా యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. 22,24,26 తేదీల్లో తాము ఉక్రెయిన్కు ఫ్లైట్లను పంపుతున్నామని తెలిపింది. ఉక్రెయిన్లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇవి ప్రారంభమవుతాయని తెలిపింది.
ఎయిరిండియా బుక్కింగ్ కార్యాలయాలు, వెబ్సైట్, కాల్ సెంటర్తో పాటు గుర్తింపు పొందిన ట్రావెల్ యాజమాన్యాల దగ్గర టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిరిండియా యాజమాన్యం పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలు నడిపే విషయంలో కొన్ని ఒప్పందాలున్నాయి. ఈ టెన్షన్ వాతావరణంతో ఆంక్షలను ఎత్తేసింది భారత ప్రభుత్వం. దీంతో విమానాలను నడపడం మరింత సులభమైంది.
ఇదే విషయంపై భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. ఉక్రెయిన్లో ఉండే భారతీయులను ఇప్పటికిప్పుడు భారత్కు తరలించే ఆలోచనలు లేవని, దీంతో ప్రత్యేక విమానాలకు ఎలాగూ ఆస్కారముండదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. కరోనా కారణంగా విదేశాలకు అంతర్జాతీయ విమానాలు నడిపే విషయంలో కొన్ని ఒప్పందాలు జరిగాయని, వీటి ప్రకారం కొన్ని ఆంక్షలు, పరిమితులు అమలులో ఉన్నాయన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా… విమానాల సంఖ్య, ప్రయాణికుల సంఖ్యపై ఉన్న ఆంక్షలను ఎత్తేశామని, వీరిని తీసుకురావడానికి ఇండియా- ఉక్రెయిన్ మధ్య ఛార్టెడ్ ఫ్లైట్లను ప్రోత్సహిస్తున్నామని అని అరిందం బాగ్చి వెల్లడించారు.