బీజింగ్: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం నివారణకు తాలిబన్లపై ఆంక్షలు విధించడం వల్ల సమస్య పరిష్కారం కాదని జీ-7 సభ్య దేశాలకు హితవు చెప్పింది. గత చేదు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని వివేకంతో వ్యవహరించాలని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం పేర్కొన్నారు.
ఆఫ్ఘన్ సంక్షోభంపై జీ-7 సభ్య దేశాల అధినేతలు వర్చువల్ వేదికగా చర్చించనున్నారు. జీ-7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్యదేశాలు. ఆఫ్ఘనిస్థాన్లో ప్రభుత్వాన్ని తాలిబన్లు కైవశం చేసుకున్న తర్వాత నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై జీ-7 దేశాలు చర్చించనున్నాయి. ఈ సమావేశానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధ్యక్షత వహిస్తారు.
ఆఫ్ఘన్ ప్రజలకు మద్దతుగా నిలుస్తూ.. శరణార్థులకు అండగా నిలవాలని జీ-7 దేశాలను బోరిస్ జాన్సన్ కోరనున్నారు. తాలిబన్లపై ఆంక్షలు విధించి ఒత్తిడి తేవాలని జీ-7 దేశాలు ప్రణాళిక సిద్ధం చేశాయన్న వార్తలపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పందించారు. ఆంక్షలు విధించడానికి బదులు శాంతిని కాపాడుతూ ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రీకరించాలని కోరారు.