పారిస్: బాంబు దాడులు జరుగుతాయంటూ బెదిరింపులు వచ్చాయి. స్పందించిన అధికారులు ఆరు విమానాశ్రయాలను ఖాళీ చేయించారు. (French Airports Evacuated) క్షుణ్ణంగా తనిఖీలు నిర్వంచారు. ఫ్రాన్స్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం బాంబు దాడులు జరుగవచ్చంటూ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో రాజధాని పారిస్కు సమీపంలో ఉన్న లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాలను ఖాళీ చేయించారు. విమాన ప్రయాణికులను ఎయిర్పోర్ట్ల నుంచి బయటకు పంపివేశారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఫ్రాన్స్కు చెందిన డీజీఏసీ ఏవియేషన్ అథారిటీ ఈ విషయాన్ని ధృవీకరించింది. దాడుల బెదిరింపు వల్ల పలు విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు వెబ్సైట్లో పేర్కొంది.
కాగా, అక్టోబర్ 7న ఊహించని విధంగా ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకార దాడులు చేస్తున్నది. నాటి నుంచి ఫ్రాన్స్కు దాడుల బెదిరింపు ఈమెయిల్స్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో గత శుక్రవారం ఇస్లామిక్ స్టేట్ గ్రూప్కు విధేయుడైన ఒక వ్యక్తి అలజడి సృష్టించాడు. ఫ్రాన్స్లోని అరాస్ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారు.