కాబూల్: పైన ఉన్న ఫొటోలోని మహిళను చూశారు కదా. ఈమె పేరు జరీఫా ఘఫారీ. ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తొలి అతి పిన్న వయసు, మహిళా మేయర్. ఇప్పుడా దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో వాళ్లు ఎలాగూ తనను చంపడానికి వస్తారని జరీఫా చెబుతోంది. నేను ఇంట్లోనే కూర్చున్నాను. వాళ్ల కోసం వేచి చూస్తున్నాను. నాకు, నా కుటుంబానికి సాయం చేయడానికి ఎవరూ లేరు. నా భర్త, కుటుంబంతో కలిసి ఇక్కడే ఉన్నాను. నాలాంటి వాళ్ల కోసం వాళ్లు వస్తారు. చంపుతారు అని జరీఫా అనడం గమనార్హం. దేశాధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్ ఘనీతోపాటు ఇతర మంత్రులు కూడా దేశం వదిలి పారిపోగా.. నేను ఎక్కడికి వెళ్లాలి అని జరీఫా అడుగుతోంది.
కొన్ని వారాల కిందటే ఆమె ఓ అంతర్జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ భవిష్యత్తు బాగానే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆమె ఆశలు అడియాసలయ్యాయి. 2018లో దేశంలోని మైదాన్ వార్దాక్ ప్రావిన్స్కు తొలి మహిళా మేయర్గా ప్రమాణం చేసిన ఆమె.. ఇప్పుడు తాలిబన్ల రాక కోసం ఎదురు చూస్తున్నారు. గతంలోనూ తాలిబన్ల నుంచి ఆమెకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. హత్యా ప్రయత్నాలూ జరిగాయి. గతేడాది నవంబర్ 15న ఆమె తండ్రి జనరల్ అబ్దుల్ వసీ ఘఫారీని మిలిటెంట్లు కాల్చి చంపారు.
మూడు వారాల కిందట దేశ యువతపై ఎన్నో ఆశలు పెట్టుకొని మాట్లాడిన ఆమె.. ఇప్పుడు పూర్తి నిస్సహాయురాలుగా మారిపోయారు. కాబూల్ ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లదని తాము భావించేవాళ్లమని జరీఫా చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో పని చేసిన ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్లు ప్రకటించినా.. వాళ్ల గత చరిత్ర చూసిన వాళ్లు మాత్రం ఈ మాటలను పెద్దగా విశ్వసించడం లేదు. ముఖ్యంగా మహిళలంటే ఇంటికే పరిమితమయ్యే సెక్స్ బానిసలన్న తాలిబన్ల సిద్ధాంతం.. అక్కడి మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది.