కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ను తాలిబన్ ముట్టడించిన సమయంలో అమెరికా సైనికుడికి అప్పగించిన పసి బాలుడు ఎట్టకేలకు నాలుగు నెలల తర్వాత తన కుటుంబం చెంతకు చేరాడు. ఆఫ్ఘనిస్థాన్లో చాలా ఏండ్లుగా మోహరించిన అమెరికా సైన్యం వెనుతిరుగుతున్న సందర్భంగా గత ఏడాది ఆగస్ట్ 19న ఊహించని విధంగా తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించారు. దీంతో భయాందోళన చెందిన ప్రజలు దేశాన్ని వీడేందుకు కాబూల్ ఎయిర్పోర్ట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరారు. తమను, పిల్లలను కాపాడాలంటూ మహిళలు చేసిన ఆర్తనాదాలు నాడు అందరినీ ద్రవింపజేశాయి.
కాగా, ఈ సందర్భంగా రెండు నెలల బాలుడు సోహైల్ను అతడి తండ్రి అహ్మదీ, కాబూల్ ఎయిర్పోర్ట్ గేటు నుంచి అమెరికా సైనికుడికి అప్పగించాడు. ఈ ఫొటో నాడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనంతరం ఆ వ్యక్తి తన భార్య, మిగతా పిల్లలతోపాటు మరింత మందితో అమెరికా వెళ్లే విమానం ఎక్కాడు. దీనికి ముందు తమ పిల్లవాడి కోసం అక్కడ వెతికినా కనిపించలేదు. మరో అమెరికా విమానంలో ఆ బాలుడు ఉండవచ్చని సిబ్బంది తెలిపారు.
దీంతో అమెరికా వెళ్లిన ఆ కుటుంబం డిసెంబర్ నెలలో మిచిగాన్ చేరింది. అయితే తమ పిల్లవాడు కనిపించకపోవడంపై ఆ కుటుంబం ఆందోళన చెందింది. ఆ బాలుడు ఎక్కడ ఉన్నాడో అన్నది నాలుగు నెలలుగా వారికి తెలియలేదు. అమెరికా సైనికుడికి అప్పగించిన బాలుడు మిస్సింగ్ కావడం కలకలం రేపింది.
కాగా, గత ఏడాది నవంబర్లో బాలుడు సోహైల్ ఆచూకీపై ఆఫ్ఘన్ శరణార్థుల సంస్థకు ఒక సమాచారం అందింది. 29 ఏండ్ల ట్యాక్సీ డ్రైవర్ హమీద్ సఫీ వద్ద ఆ చిన్నారి ఉన్నట్లు తెలిసింది. మరోవైపు గత ఏడాది ఆగస్ట్ 19న తన సోదరుడు, కుటుంబాన్ని దేశం వీడేందుకు తాను సహకరించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థకు హమీద్ సఫీ తెలిపాడు. ఈ సందర్భంగా అక్కడ నేలపై ఏడుస్తూ ఒంటరిగా ఉన్న బాలుడు తనకు కనిపించినట్లు అతడు చెప్పాడు. బాలుడి తల్లిదండ్రులు కనిపించకపోవడంతో ఇంటికి తీసుకెళ్లి పెంచుతున్నట్లు వెల్లడించాడు. ‘బాలుడి తల్లిదండ్రులు కనిపిస్తే తిరిగి ఇస్తా. లేకపోతే నేనే పెంచి పెద్ద చేస్తా’ అని నవంబర్ నెలలో రాయిటర్స్ వార్తా సంస్థతో సఫీ అన్నాడు.
మరోవైపు, ఆ బాలుడ్ని అప్పగించాలని ఆఫ్ఘన్ శరణార్థుల సంస్థ సహాయంతో కాబూల్లోని బాలుడి బంధువులు కోరగా తొలుత హమీద్ సఫీ నిరాకరించాడు. తన కుటుంబాన్ని కూడా అమెరికాకు తీసుకెళ్లాలని అతడు డిమాండ్ చేశాడు. పలు వారాలపాటు చర్చలు జరిపినా, ప్రాథేయపడినా అతడు ముందుకు రాలేదు. చివరకు తాలిబన్ పోలీసులు హమీద్ను నిర్బంధించడంతో దిగి వచ్చాడు. బాలుడు సోహైల్ను ఎట్టకేలకు కాబూల్లోని తాత, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించాడు.
దీంతో బాలుడ్ని తన వద్ద ఉంచి ఆలనాపాలనా చూసినందుకు 950 డాలర్ల (సుమారు రూ.70 వేలు) విలువైన లక్ష ఆఫ్ఘన్ కరెన్సీని హమీద్కు ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఇచ్చారు. అయితే ఆ బాలుడ్ని ఎంతో అల్లరుముద్దుగా చూసుకున్నానని, తిరిగి అప్పగించడం చాలా కష్టంగా ఉందని ఈ సందర్భంగా హమీద్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు తాత వద్దకు చేరిన తమ కుమారుడు సోహైల్ను అమెరికాలో ఉన్న తల్లిదండ్రులు శనివారం వీడియో కాల్ ద్వారా చూసి మాట్లాడారు. తమ పిల్లవాడు త్వరలో అమెరికాలోని తమ వద్దకు చేరడంపై వారు ఆశాభావంతో ఉన్నారు.
రాయిటర్స్ వార్తా సంస్థ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎట్టకేలకు ఆ బాలుడు తన కుటుంబాన్ని చేరడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా ఆ బాలుడి తల్లిదండ్రులు అనుభవించిన మానసిక క్షోభను మాటల్లో వర్ణించలేమని కొందరు పేర్కొన్నారు.