బీజింగ్: కార్ల తాళాలు ఆఫీస్లో ఉన్నాయంటూ ట్వీట్ చేసి మరీ ఆఫ్ఘనిస్థాన్ రాయబారి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా జీతాలు లేకపోవడంతో చైనాలోని ఆప్ఘన్ రాయబారి జావిద్ అహ్మద్ ఖాయం తన పదవి నుంచి సోమవారం తప్పుకున్నారు. గత ఏడాది ఆగస్ట్లో ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ వశమైనప్పటి నుంచి తాము పడిన ఆర్థిక కష్టాలను ఆయన విన్నవించారు.
‘గౌరవప్రదమైన బాధ్యతకు ముగింపు: నేను అంబాసిడర్గా నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాను. ఆఫ్ఘనిస్థాన్, మరియు నా ప్రజలకు ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా భావించాను. నా రాజీనామాకు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన కారణాలు చాలా ఉన్నాయి. కానీ నేను వాటిని ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. హ్యాండ్ ఓవర్ నోట్ ద్వారా అన్నీ సజావుగా అందజేశాను’ అని ట్విట్టర్లో ఖాయం పేర్కొన్నారు.
కాగా, తమకు ఆరు నెలలుగా జీతాలు లేవంటూ ఆఫ్ఘన్ విదేశాంగ శాఖకు జనవరి 1న రాసిన ఒక లేఖను కూడా ఖాయం సోమవారం బహిర్గతం చేశారు. తన వారసుడు సాదత్ కోసం లక్ష డాలర్ల నిధులు ఎంబసీ బ్యాంకు ఖాతాలో మిగిల్చి ఉంచినట్లు అందులో పేర్కొన్నారు. ఆయన వచ్చేసరికి రాయబారి కార్యాలయంలో ఎవరూ ఉండరని, ఇక్కడివన్నీ అప్పగించేందుకు స్థానిక వ్యక్తిని అందుబాటులో ఉంచినట్లు అందులో తెలిపారు. అయితే చైనాకు కొత్త ఆఫ్ఘన్ రాయబారిని ఎవరు నియమించారు, ఆయన ఎక్కడి వ్యక్తి అన్నది ఇంకా స్పష్టం కాలేదు.