‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జి’ ప్రణాళిక లీక్!
లండన్, సెప్టెంబర్ 4: బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణిస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తవచ్చు? ఆమె పార్థివ దేహానికి ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలి? అన్న విషయాలపై ‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జి’ బ్రిటన్ అధికారులు పేరుతో రూపొందించిన ప్రణాళిక లీక్ అయింది. బ్రిటన్ చరిత్రలోనే అత్యధిక కాలం రాణి హోదాలో కొనసాగుతున్న ఘనత ఎలిజబెత్దే. ఆమె వయసు 95 ఏండ్లు. ఆ ప్రణాళికలోని వివరాల ప్రకారం.. ఎలిజబెత్ మరణించిన రోజును ‘డీ-డే’గా పేర్కొనాలి. ఆమె పార్థివ దేహాన్ని పార్లమెంటు భవనంలో 3 రోజుల పాటు సందర్శనకు ఉంచుతారు. 10 రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ వ్యవధిలో ఆమె కుమారుడు, వారసుడు ప్రిన్స్ చార్లెస్ యూకే పర్యటన చేస్తారు. రాణి అంత్యక్రియల్లో పాల్గొనడానికి లక్షల మంది లండన్కు పోటెత్తవచ్చని, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగొచ్చని అధికారులు భావిస్తున్నట్టు పత్రాల ద్వారా తెలిసింది. ఆ రోజు నగరంలో ఆహార కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని అనుమానించారు.
అసలు సంగతేంటంటే.. తన అంత్యక్రియలు జరిపే రోజును జాతీయ సంతాప దినంగా ప్రకటించేలా రాణి, బ్రిటన్ ప్రధానికి మధ్య ఒప్పందం కుదిరిందని పత్రాలు పేర్కొంటున్నాయి. అంటే ఈ ప్రణాళికలో రాణి కూడా భాగస్వామి అయ్యారన్న మాట. ఈ పత్రాలు లీక్ అయినట్టు కానీ, అలాంటి ప్రణాళిక ఉన్నట్టు కానీ ధ్రువీకరించడానికి బకింగ్హామ్ ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి.