Pandemic | లండన్, సెప్టెంబర్ 25: భవిష్యత్తులో కొవిడ్-19 కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పానిష్ ఫ్లూతో కోట్లాది మంది చనిపోయినట్టే, ఈ కొత్త వైరస్ కారణంగా కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్కు నేతృత్వం వహించిన సైంటిస్టు కేట్ బ్రిఘం హెచ్చరించారు. జంతువుల్లో వైరస్ విస్తరిస్తుందని, మ్యుటేషన్లు ఏర్పడి మానవాళికి పెద్ద సవాల్గా మారుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో బ్రిఘం వివరించారు. ఈ పుస్తకానికి వ్యాక్సిన్ నిపుణుడు టిమ్ హ్యామ్స్ సహ రచయితగా ఉన్నారు. ‘వేలాది రకాల వైరస్ల నుంచి మహమ్మారి ప్రబలేందుకు అవకాశముంది. ఇందులో 25 వైరస్ కుటుంబాలను సైంటిస్టులు గుర్తించారు.
ప్రతి కుటుంబంలో వేలాది రకాల వైరస్లుంటాయి. దీంట్లో ఏదో ఒక వైరస్ వల్ల మహమ్మారి ప్రబలే అవకాశముంది’ అని టిమ్ హ్యామ్స్, బ్రిఘం తెలిపారు. భవిష్యత్తులో మహమ్మారి రాబోతున్నదని డబ్ల్యూహెచ్వో 2018లో హెచ్చరించింది. వైరస్ను ‘డిసీజ్ ఎక్స్’గా పేర్కొన్నది. ఎబోలా, హెచ్ఐవీ-ఎయిడ్స్, కొవిడ్-19 వైరస్లు తొలుత జంతువుల్లో ప్రవేశించి, ఆ తర్వాత జంతువుల నుంచి మానవులకు సోకాయి. డిసీజ్-ఎక్స్ కూడా అదేవిధంగా ఉండొచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు. అత్యధికంగా మరణాల రేటు కలిగిన ఎబోలా, బర్డ్ ఫ్లూ, మెర్స్.. వైరస్లనే అరికట్టాం, రాబోయే మహమ్మారిని సులభంగా ఎదుర్కొనవచ్చునన్న అభిప్రాయాన్ని బ్రిగం, హేమ్స్ కొట్టిపారేశారు.
బీజింగ్: జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి వైరస్లు మానవులకు సోకుతుండటంపై పరిశోధనలు చేసి, ‘బ్యాట్వుమన్’గా ప్రసిద్ధి చెందిన చైనీస్ వైరాలజిస్ట్ షి ఝెంగ్లి సంచలన హెచ్చరిక చేశారు. భవిష్యత్తులో మరో కొత్త కరోనా వైరస్ పుట్టుకురావొచ్చని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని తెలిపారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన షి బృందం 40 కరోనా వైరస్ జాతుల వల్ల మానవులపై పడే ప్రభావంపై అధ్యయనం చేసింది. వీటిలో దాదాపు సగం వైరస్ జాతులు అత్యంత ప్రమాదకరమైనవని గుర్తించింది.