న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడోవంతు దేశాల్లోని ఆర్ధిక వ్యవస్థలు డీలాపడనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరికలు చేసింది. మూడో వంతు దేశాలన్ని ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడనున్నట్లు ఐఎంఎఫ్ హెడ్ క్రిస్టలీనా జార్జీవా తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే, 2023 మరింత కఠినంగా సాగనున్నట్లు ఆమె చెప్పారు. అమెరికా, యురోపియన్ దేశాలతో పాటు చైనాలోనూ ఆర్ధిక వ్యవస్థలు మరీ నెమ్మదిగా సాగుతున్నట్లు తెలిపారు.
సీబీఎస్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం, అధిక ధరలు, వడ్డీ రేట్లు, చైనాలో మళ్లీ కోవిడ్ లాంటి పరిస్థితులు అనేక దేశాల్ని ఇబ్బందిపెడుతున్న విషయం తె లిసిందే. ఆర్ధిక మాంద్యంలేని దేశాల్లో కూడా ఈ ఏడాది లక్షలాది మంది ఆ ప్రభావానికి లోనయ్యే ఛాన్సు ఉందన్నారు.
అమెరికా ఆర్ధిక మాంద్యం అంచుల్లో ఉందని, ఇక యూరోప్ దేశాలు కూడా ఆ ప్రమాదం నుంచి గట్టెక్కడం అసాధ్యమే అని ఆమె అన్నారు. మరికొన్ని నెలల పాటు చైనాలోనూ పరిస్థితులు దారుణంగా ఉంటాయని, ఆ దేశ ప్రగతి నెగటివ్లో ఉంటుందన్నారు.