వాషింగ్టన్, ఫిబ్రవరి 13: గగనతలంలో వరుస అనుమానాస్పద కదలికలు అగ్రరాజ్యం అమెరికాను కలవరపెడుతున్నాయి. చైనా స్పై బెలూన్ కూల్చివేత తర్వాత వరుసగా మూడుసార్లు అనుమానాస్పద కదలికలు ఏర్పడుతున్నాయి. మొన్న అలస్కాలో, నిన్న కెనడాలో వాటిని కూల్చివేయగా, తాజాగా మిషిగన్లో ఓ ఎగిరే వస్తువును కూల్చివేసింది. అయితే, ఈ కదలికలు గ్రహాంతరవాసులవా? అని అమెరికా అధికారులను ప్రశ్నించగా, ఆ అనుమానాలను కొట్టిపారేయలేమని యూఎస్ ఎయిర్ఫోర్స్ జనరల్ గ్లెన్ వాన్ హెర్క్ పేర్కొన్నారు.
అమెరికా, చైనా మధ్య బెలూన్లపై మాటల యుద్ధం ముదురుతున్నది. తమ దేశంపై బెలూన్లతో చైనా నిఘా పెడుతున్నదని అమెరికా ఆరోపిస్తుంటే.. తమ దేశంపైనా అమెరికా బెలూన్లు ఎగిరాయంటూ చైనా ప్రత్యారోపణలు ప్రారంభించింది. ఇటీవల అమెరికా గగనతలంలో ఎగురుతున్న చైనా బెలూన్ను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇది చైనా నిఘా బెలూన్ అని అమెరికా ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణలపై సోమవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ… తాము అమెరికాపైకి ఎలాంటి నిఘా బెలూన్లను పంపించలేదని పేర్కొన్నారు. తమ దేశంపైనే గత ఏడాది 10కి పైగా అమెరికా బెలూన్లు తమ అనుమతి లేకుండా ఎగిరాయని ఆరోపించారు.