లండన్: పుట్టిన రోజైనా, పెండ్లి రోజైనా, ఇంట్లో జరిగే ఏ ఇతర శుభకార్యంలోనైనా కేకుకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆ కేకును ఆ రోజే కట్ చేసుకొని తినడం ఆనవాయితీ. ఎందుకంటే నిలువచేస్తే గంటల్లోనే అది పాడైపోతుంది. అలాంటిది ఇంగ్లండ్కు చెందిన డోరే అండ్ రీస్ ఆక్షన్స్ అనే సంస్థ ఏకంగా 41 ఏండ్ల క్రితం నాటి కేకును వేలం వేసేందుకు సిద్ధమైంది.
ఇంతకూ ఆ కేకు ఎక్కడిదంటే.. కింగ్ చార్లెస్ – ప్రిన్సెస్ డయానాల పెండ్లి నాటిది. 1981లో జరిగిన వారి పెండ్లికి ప్రపంచ దేశాల నుంచి మూడు వేల మందికి పైగా బంధుమిత్రులు హాజరయ్యారు. లక్షలాది మంది ఆ వివాహాన్ని టీవీల్లో వీక్షించారు. దాంతో 20వ శతాబ్దంలోనే గొప్ప పెండ్లిగా అది రికార్డుల్లో నిలిచింది. అయితే పెండ్లికి హాజరైన మూడు వేల మందిలో నైగెల్ రికెట్స్ అనే వ్యక్తి కూడా ఒకరు.
అందరికీ ఇచ్చినట్టే ఆ పెండ్లిలో నైగెల్కు కూడా ఓ కేకు ఇచ్చారు. నైగెల్ ఆ కేకును ఇంటికి తీసుకెళ్లి పూర్తిగా తినకుండా కొంత భాగాన్ని భద్రపర్చారు. గత ఏడాది ఆయన మరణించారు. అయితే, ఆయన భద్రపర్చిన కేకు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆ కేకులోని ఒక ముక్కను ఇప్పుడు వేలం వేయబోతున్నారు. వేలంలో ఆ కేకు ముక్క ప్రారంభ ధరను మన కరెన్సీలో సుమారు రూ.27 వేలుగా నిర్ణయించారు.
ఇంతకూ నాలుగు దశాబ్దాల నాటి ఆ కేకు తినడానికి పనికొస్తుందా లేక దాసుకోవడానికి మాత్రమేనా అనేది వేలం నిర్వాహకులకు, వేలంలో ఆ కేకును కొనబోయే వాళ్లకు మాత్రమే తెలుసు. నైగెల్ రికెట్స్ బతికి ఉండగా కూడా ఈ కేకులోని ఒక ముక్కను వేలం వేశారు. 2014లో జరిగిన వేలంలో ఆ కేకు ముక్క మన కరెన్సీలో రూ.1.27 లక్షలు పలికింది.
కాగా, చార్లెస్-డయానాల పెండ్లికి నైగెల్తోపాటు రాజ కుటుంబాలకు చెందిన కొందరు కలిసి రైటింగ్ టేబుల్ను బహూకరించారట. ఆ టేబుల్ను చూసి కింగ్ చార్లెస్ చాలా సంతోషపడ్డారట. ఇదిలావుంటే 1981, జూలై 29న జరిగిన చార్లెస్-డయానాల వివాహ బంధం కొన్నేండ్లకే తెగిపోయింది. 1992లో వారు విడిపోయారు. ఆ తర్వాత నాలుగేండ్లకు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రమాదంలో డయానా ప్రాణాలు కోల్పోయారు.