Viral News | న్యూఢిల్లీ, జూలై 25: ఏకధాటిగా ఏడు రోజుల పాటు ఏడుస్తూ రికార్డు సృష్టించడానికి నైజీరియా యువకుడొకరు చేసిన ప్రయత్నం వికటించింది. కంటిచూపు పోయి నిజంగానే ఏడ్పించింది. గిన్నిస్ బుక్ వారు అతడి రికార్డు యత్నాన్ని నమోదు చేయకపోగా, పలు రుగ్మతలు చుట్టుముట్టాయి. తాత్కాలికంగా అతడి కంటి చూపు పోయింది. పైగా తలనొప్పి, కళ్లు వాచిపోవడం, ఎర్రబారిపోవడం వంటి అనారోగ్య లక్షణాలతో ఇబ్బంది పడ్డాడు. నైజీరియాకు చెందిన టెంబు ఎబిరే ఆపకుండా ఏడు రోజుల పాటు ఏడుస్తూ రికార్డు సృష్టించడానికి సిద్ధమై తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు.
ఈ క్రమంలో అతడిని పలు రుగ్మతల బారిన పడ్డాడు. 45 నిమిషాల పాటు కంటి చూపును కోల్పోవడంతో గందరగోళానికి గురయ్యాడు. దానికి తోడు విపరీతమైన తలనొప్పి, ముఖం, కళ్లు వాచిపోవడంతో మధ్యలోనే తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. టెంబు తన రికార్డు ప్రయత్నాన్ని గిన్నిస్ బుక్ నిర్వాహకులకు ముందస్తుగా తెలియజేయకపోవడంతో వారు దానిని నమోదు చేయలేదు. కాగా, దీనిపై హైదరాబాద్కు చెందిన కామినేని హాస్పిటల్ నేత్ర వైద్య నిపుణుడు జయపాల్రెడ్డి మాట్లాడుతూ ఏకధాటిగా అన్ని రోజులు ఏడవడం వల్ల తాత్కాలిక అంధత్వానికి దారి తీస్తుందని చెప్పారు. కంటి నుంచి నీరు వెళ్లిపోవడం వల్ల కళ్లు ఎండిపోయి మసకమసకగా కన్పించడంతో పాటు వికారం, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయని చెప్పారు.