వాషింగ్టన్, ఆగస్టు 5: ఇకపై చావుకు కొత్త నిర్వచనం ఇవ్వాలేమో! అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధన గురించి వింటే మీరు కూడా ఇదే మాట చెప్తారు!! కొన్ని పందులు మృతి చెందిన గంట తర్వాత వాటిలో రక్తప్రసరణను వారు పునరుద్ధరించగలిగారు.
అంతేగాకుండా కొన్ని అవయవాల్లో కణాలు తిరిగి పనిచేయగలిగేట్లు చేశారు. సైంటిఫిక్ జర్నల్ నేచర్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. కణాలు తిరిగి పనిచేసేందుకు తాము సరికొత్త సాంకేతికతను వాడినట్టు అమెరికాలోని యేల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. అవయవ మార్పిడి విషయంలో ఈ పరిశోధన కొత్త అవకాశాలకు ద్వారాలు తెరువనున్నది.
మరణించిన తర్వాత అవయవాలు ఎక్కువకాలం సజీవంగా ఉండేందుకు ఈ సాంకేతికత దోహదపడనుంది. ప్రపంచవ్యాప్తంగా అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మందికి ఈ పరిశోధన వరంగా మారనున్నది.
‘అన్ని కణాలు వెంటనే మృతిచెందవు. ఆ తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. అక్కడే మనం జోక్యం చేసుకొని వాటిని పునరుద్ధరించవచ్చు’అని యేల్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ రిసెర్చ్ సైంటిస్ట్ డేవిడ్ యాండ్రిజెవిక్ వెల్లడించారు. ఇంతకుముందు కూడా అమెరికాకు చెందిన పరిశోధకుల బృందం పందుల మెదడులో కణాలు తిరిగి పనిచేసేలా కృషిచేసింది.
తాజా అధ్యయనంలో అదే సాంకేతికతను వినియోగించి, మొత్తం శరీరానికి దాన్ని విస్తరించారు. పరిశోధనలో భాగంగా పందుల్లో గుండెపోటు వచ్చేట్లు చేశారు. శరీరంలో రక్తప్రసరణ ఆగిపోయాక తమ టెక్నిక్ను ఐప్లె చేశారు. పందుల రక్తం, సింథటిక్ హెమోగ్లోబిన్, కణాలను రక్షించే, రక్తం గడ్డకట్టకుండా చూసే ఔషధాలు కలిగిన లిక్విడ్ను చనిపోయిన పందుల శరీరాల్లోకి పంప్ చేశారు.
అనంతరం రక్తప్రసరణ తిరిగి ప్రారంభమైంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు వంటి కీలక అవయవాల్లో మళ్లీ కణాలు పనిచేయడం ప్రారంభించాయి. సుమారు ఆరు గంటలపాటు అవి పనిచేసినట్టు పరిశోధకులు తెలిపారు. కణాల మృతిని నిలుపుదల చేయొచ్చని దీని ద్వారా అర్థమవుతున్నదని పరిశోధకులు నేనడ్ సెస్టన్ చెప్పారు.