ఓ రోజు ప్రధాని ఇమ్రాన్, సీనియర్ మంత్రి షేక్ రషీద్ ఇద్దరూ ఓ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలోనే ప్రధాని ఇమ్రాన్ ఫోన్ మోగింది. ఈ ఫోన్లో ఇమ్రాన్ ఆర్మీ చీఫ్ బాజ్వాపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పక్కనే ఉన్న సీనియర్ మంత్రి షేక్ రషీద్ రికార్డు చేశారు. ఆ రికార్డును ఆర్మీ చీఫ్ బాజ్వా ముందు ఉంచారు. అయినా.. కొన్ని రోజులు ఆర్మీ చీఫ్ సైలెంట్గానే వున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇమ్రాన్కు సెగ పెట్టడం ప్రారంభమైంది. ఇప్పుడు ఏకంగా పాక్లో ఎన్నికలే వచ్చేశాయి.
ఒకే ఒక్క ఫోన్ రికార్డింగ్.. పాకిస్తాన్ రాజకీయాలనే సమూలంగా మార్చి పారేసింది. ఈ ఒక్క ఫోన్ రికార్డింగే ఆర్మీ చీఫ్ బాజ్వాకు చిర్రెత్తించింది. ఓ కారులో ప్రధాని ఇమ్రాన్.. ఆయన కేబినెట్లో సహచర మంత్రి షేక్ రషీద్ ఇద్దరూ కారులో వెళ్తున్నారు. ఇంతలో ప్రధాని ఇమ్రాన్ ఫోన్ మోగింది. ఆ కాల్లో ఇమ్రాన్ ఆర్మీ చీఫ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.. అంతే… కథ మొత్తం గిర్రుమని తిరిగిపోయింది.
దాదాపుగా అన్ని దేశాల్లో ఆయా నేతల భవితవ్యం ప్రజల చేతుల్లో వుంటుంది. కానీ.. పాకిస్తాన్ ఇందు పూర్తిగా భిన్నం. ప్రజల నుంచి తీవ్ర నిరసన వచ్చినా ప్రభుత్వం సేఫ్. ఆర్మీ నుంచి మాత్రం నిరసన రావొద్దు. ఆర్మీకి గనక చిర్రెత్తిందో… ప్రభుత్వం రాత్రికి రాత్రే కుప్ప కూలడం ఖాయం.
కొన్ని నెలలుగా ప్రధాని ఇమ్రాన్, ఆర్మీ చీఫ్ బాజ్వా మధ్య సంబంధాలు బాగో లేవు. అయినా ప్రభుత్వం నడుస్తోంది. ఎందుకంటే.. అప్పటి ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ను బదిలీ చేయవద్దని ప్రధాని ఇమ్రాన్ డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇమ్రాన్ గద్దె నెక్కడంలో ఆయనదే కీలక పాత్ర. బాజ్వాది కూడా కీలక పాత్రే. అయితే ప్రధాని చేసిన సిఫార్సును ఆర్మీ చీఫ్ బాజ్వా పెడ చెవిన పెట్టారు. ఆ అధికారిని రావల్పిండికి బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆర్మీ చీఫ్ బాజ్వాకి, ప్రధాని ఇమ్రాన్కి మధ్య గ్యాప్ పెరిగిపోయింది.
నా అటెండర్గా కూడా వుంచుకోను.. .మంత్రిపై అప్పట్లో ఇమ్రాన్ వ్యాఖ్యలు
షేక్ రషీద్…. ఏ ప్రభుత్వం వున్నా.. ఈయన మాత్రం మంత్రిగా కచ్చితంగా వుంటారు. అయితే ఈయనకు కాస్త నోరు అదుపులో వుండదని పాక్లో మాట. ఇంకో మాట కూడా వుంది. సైన్యానికి నమ్మిన బంటు అని. అన్ని విషయాలూ సైన్యానికి చేరవేస్తారన్న మాట మూటగట్టుకున్నారు. అయితే ఓ రోజు షేక్ రషీద్, ఇమ్రాన్.. ఇద్దరూ ఓ టీవీ డిబేట్లో పాల్గొన్నారు. ఒక వేళ మీ ప్రభుత్వం వస్తే… షేక్ రషీద్ మంత్రి అవుతారా? అని జర్నలిస్టు అడగ్గా… నా అటెండర్గా కూడా ఆయన్ను నియమించుకోను అని ఇమ్రాన్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్ ప్రభుత్వం వచ్చింది. ఏం జరిగిందో గానీ… ఈ షేక్ రషీద్ ఇప్పుడు హోమంత్రి.