బాల్టిమోర్, మార్చి 26: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. బాల్టిమోర్లోని పటాప్స్కో నదిలో మంగళవారం తెల్లవారు జామున ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన పేకమేడలా కూలిపోయింది. వంతెన పిల్లర్ను నౌక ఢీకొట్టడంతో వంతెన కూలిపోతున్న దృశ్యాలు వైరల్గా మారాయి.
వంతెనను ఢీకొట్టింది సింగపూర్కు చెందిన సినెర్జీ మెరైన్ గ్రూప్నకు చెందిన ‘డాలీ’ అనే నౌకగా గుర్తించారు. ఇది బాల్టిమోర్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నౌకలో ఇద్దరు పైలెట్లు సహా 22 మంది సిబ్బంది ఉండగా అందరూ భారతీయులేనని సినెర్జీ మెరైన్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం వీరంతా సురక్షితంగా ఉన్నారు.
నీటిలో పడిపోయిన వాహనాలు
వంతెన కూలినప్పుడు పైనుంచి ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. దాదాపు 20 మంది నీటమునిగినట్టు అధికారులు భావిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరిని సహాయ సిబ్బంది వెలికితీశారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నదని బాల్టిమోర్ అగ్నిమాపక విభాగం తెలిపింది.