సిడ్నీ: ఓ 16 ఏండ్ల బాలిక ఆస్ట్రేలియాలోని స్వాన్ నది అందాలను వీక్షించేందుకు స్నేహితులతో కలిసి వెళ్లింది. పశ్చిమ ఆస్ట్రేలియా రాజధాని అయిన పెర్త్ సమీపంలోని ఫ్రెమాంటిల్ ఓడరేవు దగ్గరి ట్రాఫిక్ బ్రిడ్జిపై నుంచి నదిలో అడుతున్న డాల్ఫిన్లను వీక్షించింది. అక్కడ కొంతమంది డాల్ఫిన్లతో కలిసి ఈదుతుండటం చూసి.. తను కూడా డాల్ఫిన్లతో ఈదాలని ముచ్చటపడింది.
అంతే.. ఒక్కసారిగా బ్రిడ్జి పైనుంచి నదిలో దూకేసింది. బాలిక అలా దూకడమే ఆలస్యం ఆమెపై షార్క్ దాడి చేసింది. నీటిపై ఈదుతున్న బాలికను ఒక్కసారిగా లోపలికి లాక్కెళ్లింది. అది గమనించిన బాలిక స్నేహితులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నదిలో నుంచి బాలికను బయటికి తీసుకొచ్చారు.
కానీ, అప్పటికే తీవ్ర గాయాలతో ఆమె మరణించి ఉంది. కాగా, గత 100 ఏండ్లలో ఎన్నడూ స్వాన్ నదిలో షార్క్ దాడి ఘటనలు చోటుచేసుకోలేదని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. 1923లో మాత్రం ఓ 13 ఏండ్ల బాలుడిని షార్క్ దాడిచేసి చంపిందని చెప్పారు. తాజా షార్క్ దాడి నేపథ్యంలో స్వాన్ నదీ పరవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదివైపు వెళ్లినప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.