Cruise Ship | ఓ క్రూయిజ్ షిప్లో కరోనా కలకలం రేగింది. సుమారు 4,600 మంది ప్రయాణిస్తున్న ఈ షిప్లో ఏకంగా 800 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆ నౌకను అధికారులు సిడ్నీ తీరంలో నిలిపివేశారు.
కార్నివాల్ ఆస్ట్రేలియా కంపెనీకి చెందిన మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌక 12 రోజుల విహారయాత్రలో భాగంగా 4,600 మంది ప్రయాణికులతో న్యూజిలాండ్ నుంచి బయలు దేరింది. సముద్రంలో సగం దూరం వెళ్లాకా షిప్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు క్రూజ్ ఆపరేటర్ కార్నివాల్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వైరస్ బారిన పడిన కొందరిలో లక్షణాలు కనిపించడం లేదని, మరికొందరిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం వారందరినీ షిప్లోనే క్వారంటైన్లో ఉంచినట్లు సంస్థ తెలిపింది. వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించినట్లు పేర్కొంది.
కాగా, ఇటీవల ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వారం వ్యవధిలోనే 19వేలకు పైనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఇంత పెద్ద క్రూజ్ షిప్లో వందల్లో కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
వైరస్ బయటపడ్డ 2020 సంవత్సరంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇదే న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఓ నౌకలో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. రూబీ ప్రిన్సెస్ క్రూజ్ నౌకలో ఏకంగా 914 మందికి కరోనా సోకగా.. 28 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంసమైంది.