దోహా, డిసెంబర్ 28: గూఢచర్యం ఆరోపణల కేసులో ఖతార్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు భారీ ఊరట లభించింది. నిందితులందరికీ శిక్షను తగ్గిస్తూ అక్కడి అప్పిలేట్ కోర్టు తీర్పు వెలువరించిందని భారత విదేశాంగ శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో బాధితుల కుటుంబాల్లో, ఖతార్లోని భారత దౌత్య అధికారుల్లో ఆనందం వ్యక్తమైంది. ‘దోహ్రా గ్లోబల్ టెక్నాలజీ’లో పనిచేస్తున్న భారత మాజీ నేవీ అధికారులను గూఢచర్యం, దేశద్రోహం ఆరోపణలపై 2022 ఆగస్టులో ఖతార్ ప్రభుత్వం అరెస్టు చేసింది.
ఈ ఏడాది అక్టోబర్లో వారికి మరణశిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు తీర్పు వెలువరించటం సంచలనం రేపింది. తీర్పును సవాల్ చేస్తూ భారత అధికారులు గత నెలలో అప్పిలేట్ కోర్టును ఆశ్రయించారు. అప్పిలేట్ కోర్టు తీర్పునకు సంబంధించి పూర్తిపాఠం ఇంకా అందాల్సి ఉందని, ఆ తర్వాతే తదుపరి అడుగు ఏంటన్నది నిర్ణయిస్తామని భారత అధికారులు చెప్పారు.నేవీలో కెప్టెన్గా పనిచేసిన నవతేజ్ గిల్, మరో మాజీ కెప్టెన్ సౌరభ్ వశిష్టి, మాజీ కమాండర్లు పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్పాల్, ఎస్కే గుప్తా, బీకే వర్మ, సుగుణాకర్ పాకాల, సైలర్ రాజేష్లను గూఢచర్యం కేసులో అరెస్ట్ చేశారు. మాజీ కెప్టెన్ నవతేజ్గిల్, నావల్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చదివినప్పుడు భారత రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు.