లండన్ : ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఏడుగురు రష్యన్ జనరల్స్ హతమైనట్లు పశ్చిమ దేశాల అధికారులు వెల్లడించారు. తాజాగా లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రేజన్స్టీవ్ మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాకోవ్ రష్య 49వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ అని తెలిపారు. రష్యన్ ఆర్మీ కమాండర్ జనరల్ వ్లాయిస్లావ్ యేర్సోహ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈయన ఆరో కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి చెందిన జనరల్. అయితే యేర్సోహ్ను వారం రోజుల క్రితమే బాధ్యతల నుంచి తొలగించారు. ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ జరిపిన దాడిలోవ్యూహాత్మక వైఫల్యాల కారణంగా యేర్సోహ్ను బాధ్యతల నుంచి ఆకస్మికంగా తొలగించారు. ఈ ఏడుగురిలో చెచెన్ స్పెషల్ ఫోర్సెస్ జనరల్ మగోమద్ తుషేవ్ కూడా ఉన్నారు. యుద్ధంలో కేవలం 1,300 మంది సైనిక సిబ్బంది మరణించినట్లు క్రెమ్లిన్ శుక్రవారం పేర్కొంది. కానీ ఈ సంఖ్య నాలుగు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉండొచ్చని పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి.
నెలరోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తున్నది. ఇరుసేనల్లో ఎవరిది పైచేయి అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. పశ్చిమ దేశాల మీడియాల్లో వస్తున్న కథనాలు, స్వతంత్ర సంస్థల నివేదికలు, ఇరుదేశాల అధినేతల ప్రకటనలు వెరసి అక్కడ వాస్తవంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి నెలకొన్నది.