క్విటో : ఈక్వెడార్లో అతిపెద్ద జైలైన గ్వాయాక్విల్లోని లిటోరల్ పెనిటెన్షియరీలో శనివారం రాత్రి ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో 68 మంది ఖైదీలు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం ధ్రువీకరించింది. శుక్ర, శనివారం తెల్లవారు జామున జరిగిన ఘర్షణల్లో మరో 12 మంది గాయపడ్డారని ‘జిన్హువా’ న్యూస్ తెలిపింది. హింస లిటోరల్ పెనిటెన్షియరీ పెవిలియన్-2లో జరగ్గా.. ఇందులో దాదాపు 700 మంది ఖైదీలున్నారు.
జైలులో అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్స్తో సంబంధం ఉన్న జైలు ముఠాల మధ్య హింస సుమారు ఎనిమిది గంటల పాటు చోటు చేసుకుందని, ఖైదీల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఖైదీలు ప్రత్యర్థి ఖైదీలను చంపేందుకు జైలులోని మరొక భాగానికి వెళ్లేందుకు డైనమైట్తో గోడను పేల్చివేయడానికి ప్రయత్నించారని, శత్రు ఖైదీలను చంపేందుకు ఖైదీలు తమ పరుపులను తగలబెట్టారని, దీంతో పొగకు ఊపిరాడక చనిపోతారని భావించి ఉంటారని పోలీసులు చెప్పారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సంబంధం ఉన్న గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఘర్షణ చోటు చేసుకుందని పేర్కొన్నారు. పరిస్థితిని విశ్లేషించేందుకు భద్రతా కమిటీని ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో ప్రకటించారు. ఈక్వెడార్ జైళ్లలో ఖైదీల మధ్య ఘర్షణలు సాధారణ విషయం కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హింసాత్మక ఘటనల్లో 300 మందికిపైగా మృతి చెందారు. సెప్టెంబర్ 29న గ్వాయాక్విల్ లిటోరల్ పెనిటెన్షియరీలో జరిగిన తిరుగుబాటులో 118 మంది ఖైదీలు మృత్యువాతపడగా.. ఈక్వెడార్ చరిత్రలో జైలులో జరిగిన అత్యంత దారుణమైన హింసాత్మక సంఘటనగా నిలిచింది.