United Nations | చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అంతలాకుతలం చేసింది. ఈ వైరస్ వల్ల చిన్నా పెద్ద అని తేడాలేకుండా అందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైరస్ బారినపడి కోలుకున్నప్పటికీ అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇక కరోనా వ్యాప్తిని నిలువరించడానికి విధించిన లాక్డౌన్ల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణణాతీతం. వైద్యం అందక, కనీసం తినడానికి తిండి కూడా దొరక్క మృతిచెందినవారు చాలా మంది ఉన్నారు. అయితే మహమ్మారిని కట్టడిచేయడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రమంగా ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడ్డారు. అయితే కరోనా కాలంలో లాక్డౌన్ (lockdowns), ఆరోగ్య సంరక్షణ అంతరాయాల వల్ల (Health care disruptions) ప్రపంచ వ్యాప్తంగా పెద్దసంఖ్యలో చిన్నారులు రోగనిరోధకతను పెంపొందించే సాధారణ వ్యాక్సిన్లు (Routine Vaccines) తీసుకోలేకపోయారు.
మహమ్మారి విజృంభణతో 2019 నుంచి 2021 వరకు రెండేండ్ల కాలంలో సుమారు 6 కోట్ల 70 లక్షల మంది చిన్నారులు సాధారణ వ్యాక్సిన్లను పాక్షికంగా లేదా పూర్తిగా తీసుకోలేకపోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ (Uniited Nation Children’s Fund-UNICEF) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. దీనివల్ల చిన్నారుల రోగనిరోధకతకు (Immunization) సంబంధించి ఒక దశాబ్దానికిపైగా కష్టపడి సంపాదించిన లాభాలు క్షీణించిపోయాయని పేర్కొంది. ఇది తిరిగి గాడిలో పడటం అనేది పెద్ద సవాలుతో కూడుకున్న వ్యవహారమని తెలిపింది. ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలపై ఈ ప్రభావం అధికంగా ఉందని చెప్పింది.
కరోనా కాలంలో సాధారణ వ్యాక్సిన్లకు అంతరాయం ఏర్పడిన 6.7 కోట్ల చిన్నారుల్లో 4.8 కోట్ల మంది పూర్తిగా టీకాలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తంచేసింది. దీనివల్ల పోలియో, మీజిల్స్ వంటివి మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. మొత్తం 112 దేశాల్లో టీకా కవరేజీ క్షీణించిందని పేర్కొన్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టీకాలు తీసుకున్న (Vaccinated Children) చిన్నారుల శాతం 5 పాయింట్లు పడిపోయి 81 శాతానికి తగ్గిందని తెలిపింది. 2008 తర్వాత ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారని వెల్లడించింది.
మధ్య కాలంలో మీజిల్స్కు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 86 నుంచి 81 శాతానికి తగ్గిందని తెలిపింది. దీనివల్ల మీజిల్స్ కేసుల సంఖ్య 2021 కంటే 2022లో రెండింతలు నమోదయ్యాయని పేర్కొన్నది. కాగా, సాధారణ వ్యాక్సినేషన్ల వల్ల ప్రతి ఏడాది 44 లక్షల మంది తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారని, 2030 నాటికి ఈ సంఖ్యను 58 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని యూనిసెఫ్ వెల్లడించింది. వ్యాక్సిన్లు లేకపోవడంతో 1963కు ముందు ప్రతి సంవత్సరం 26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారని తెలిపింది. అందులో ఎక్కువగా చిన్నారులే ఉండేవారని పేర్కొన్నది. అయితే ఈ సంఖ్య 2021 నాటికి 1 లక్షా 28 వేలకు తగ్గిందని చెప్పింది.