సాంటియాగో: దక్షిణ అమెరికా దేశమైన చిలీని (Chile) కార్చిచ్చు దహించివేస్తున్నది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెలరేగిన కార్చిచ్చు అదుపులోకి రావడంలేదు. దావానంలా వ్యాపిస్తున్న మంటల్లో ఇప్పటివరకు 51 మంది మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దాదాపు 1,100 ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా చెలరేగిన మంటల కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ విజ్ఞప్తి చేశారు.
వాల్పరైసో రీజియన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. సెంట్రల్ చిలీలో సుమారు పది లక్షల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు వెల్లడించారు. కార్చిచ్చు కారణంగా మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ కారణంగా మంటలు చెలరేగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు.