Serbia : సెర్బియాలో అమ్మోనియాను తరలిస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బల్గేరియా సరిహద్దులోని పిరోట్ నగరం సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో డబ్బాల్లోని అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. దాంతో దగ్గర్లోని సిటీలో నివసిస్తున్న ప్రజలు విషపూరితమైన ఈ వాయువు పీల్చి ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో 50మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అంతేకాదు అంతర్జాతీయ రహదారితో పాటు స్కూళ్లు, ప్రభుత్వ సంస్థలను మూసేశారు.
ప్రమాదానికి కారణం తెలుసుకునేందుకు రైల్వే అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ దేశ రోడ్లు, భవనాల శాఖ మంత్రి గోరన్ వెసిక్ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. పట్టాలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన అన్నారు. రైలు పట్టాలు తప్పిన ప్రదేశం నుంచి కొన్నికిలోమీటర్ల మేర గాలి, నీళ్లలో అమ్మోనియా ఉందేమోనని చెక్ చేశారు. అయితే.. అమ్మెనియా లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.