కొచ్చి, జూలై 25: చదువులో ఆ విద్యార్థిని అందరికీ ఆదర్శం. పుట్టినప్పటి నుంచి కంటి చూపు లేనప్పటికీ చదువులో విశేష ప్రతిభ చూపింది. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాల్లో కేరళలోని కొచ్చి పట్టణానికి చెందిన హన్నా సిమోన్ సత్తా చాటింది. 500కు 496 మార్కులు సాధించి దివ్యాంగ విద్యార్థుల క్యాటగిరీలో టాపర్గా నిలిచింది. సింగర్గా, యూట్యూబర్గా, మోటివేషనల్ స్పీకర్గానూ హన్నా సిమోన్ రాణిస్తున్నది. చిన్నతనంలో స్కూల్లో ఇతర విద్యార్థులు తనను హేళన చేసేవారని, వేధించే వారని, దూరంగా పెట్టేవారని, అయితే తాను అవేమీ పట్టించుకోలేదని హన్నా చెబుతున్నారు. ‘జీవితంలో నేను ఇటువంటి సవాళ్లు ఎదుర్కొంటానని తెలుసు. అందుకే చిన్నతనంలో ఇటువంటి వాటిని ఎదుర్కోవడం వలన జీవితంలోని పెద్ద సవాళ్లను ఎదుర్కొనే బలాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు.