అఫ్సిన్: రెండు నెలల క్రితం భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీలో (Turkey) మరోసారి భూ ప్రకంపణలు (Earthquake) చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు అఫ్సిన్ నగరంలో (Afsin) భూమికంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ప్రకృతి సృష్టించిన పెను వీళయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు.. మరోసారి భూకంపం రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాల్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో లక్షల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమవగా, 50 వేల మందికిపైగా మరణించారు. సుమారు 16 లక్షల మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వారి ఇళ్లు భూకంపాల ధాటికి కుప్పకూలటంతో పునరావాస కేంద్రాల్లోనే ఉంటున్నారు. దేశంలో సుమారు 2 లక్షల ఇళ్లను నిర్మించేందుకు టర్కీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.