రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడో విడత చర్చలకు రంగం సిద్ధమైంది.ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఈ చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే బెలారస్ వేదికగానే ఈ చర్చలు జరుగుతాయా? లేదంటే వేదిక మార్పు ఉంటుందా అన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య రెండు రౌండ్ల చర్చలు జరిగాయి. పౌరులు సురక్షితంగా చేరుకోవడానికి వీలుగా సురక్షిత కారిడార్ల నిర్మాణానికి ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది.
రష్యాపై కఠిన ఆంక్షలకు ఉక్రెయిన్ డిమాండ్
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్న క్రమంలో తాజాగా జపరోజియా అణువిద్యుత్ ప్లాంట్పై మాస్కో సేనల దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ స్పందించారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. చెర్నోబిల్ విధ్వంసాన్ని తిరిగి చేపట్టాలని రష్యా కోరుకుంటోందని అన్నారు. రష్యా బలగాలకు ఉక్రెయిన్ తలవంచితే తదుపరి బాల్టిక్ దేశాల వంతు వస్తుందని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్తో నేరుగా చర్చలు జరపడమే ఏకైక పరిష్కారమని అన్నారు.