లండన్, జూలై 25: వాహన ప్రమాదాలు, కరెంట్ షాక్ వంటి దుర్ఘటనల్లో అవయవాలు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను అమర్చడంలో వేల్స్లోని స్వాన్సీ యూనివర్సిటీ పరిశోధకులు మరో అడుగు ముందుకేశారు. సహజత్వం ఉట్టిపడేలా కృత్రిమ అవయవాలను తయారుచేశారు. రోగ నిరోధక వ్యవస్థ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకులు ఉండకుండా వీటిని అభివృద్ధి చేయడం విశేషం. 3డీ ప్రింటింగ్ సాయంతో బయోఇంక్ ఆధారంగా ఈ కృత్రిమ అవయవాలను రూపొందించామని, వీటి తయారీలో మానవుల కణాలు, మొక్కల్లోని నానోసెల్యూలోజ్ పదార్థాలను వినియోగించినట్టు చెప్పారు. దీంతో ఇవి శరీరంలోని అవయవాల్లాగే సాధారణంగా కనిపిస్తాయన్నారు. అవయవాల్లేకుండా పుట్టినవారి కోసం కూడా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. ప్రాథమికంగా చెయ్యి, చెవి, చర్మం తదితర అవయవాలను రూపొందిస్తున్నామని తెలిపారు.
అలా మొదలైంది..
మంటల్లో చిక్కుకొని శరీరంపై తీవ్ర గాయాలైన బాధితులు ప్లాస్టిక్ సర్జరీ కోసం తమ వద్దకు వచ్చేవారని పరిశోధనకు నిధులను అందించిన స్కేర్ ఫ్రీ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అయితే, సర్జరీలో ఇతర మెటీరియల్ను వినియోగించకుండా.. తమ శరీరంలోని కణాలను వాడాలని వాళ్లు విజ్ఞప్తి చేసేవారన్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే.. తమ కణాలతో చేసి అమర్చిన అవయవం తమ శరీరంలోనిదేనన్న భావన వస్తుందని వాళ్లు చెప్పినట్టు పేర్కొన్నారు. దీంతో ఈ దిశగా ప్రయోగాలను ప్రారంభించి కృత్రిమ అవయవాలను, చర్మాన్ని తయారు చేసినట్టు పరిశోధకులు పేర్కొన్నారు.