ఆఫ్గన్లో తాలిబాన్ల పాలన ప్రారంభమైన తర్వాత మీడియాకు గడ్డుకాలం నడుస్తోంది. ఆఫ్గనిస్తాన్లో మొత్తం 34 ప్రావిన్సులుంటే… 33 ప్రావిన్సులలో 318 మీడియా సంస్థలు మూతపడ్డాయి. ఇంటర్నెషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ నివేదిక ప్రకారం 51 టీవీ ఛానళ్లు, 132 రేడియో స్టేషన్లు, 49 ఆన్లైన్ మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపేశాయని పేర్కొంది. ఇందులో అత్యధికంగా దిన పత్రికలే మూతపడ్డాయి. మొత్తం 114 దిన పత్రికలుంటే… ప్రస్తుతం కేవలం 20 దినపత్రికలే ముద్రణ అవుతున్నాయి. ఇక… పాత్రికేయుల సంఖ్య కూడా విపరీతంగా తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ నివేదిక ప్రకారం మొత్తం 5063 పాత్రికేయలు ఉంటే… ఇప్పుడు కేవలం 2334 మంది పాత్రికేయులే పనిచేస్తున్నారు. అంటే 2729 మంది పాత్రికేయులు ఉద్యోగాన్ని కోల్పోయారు.ఇక మొత్తం మహిళా ఉద్యోగుల్లో 72 శాతం మహిళా పాత్రికేయులు ఉద్యోగాలు పోయాయి.
తాలిబాన్ల పాలనలో మీడియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, అవసరమైన సమాచారం కూడా ప్రజలకు అందడం లేదని మీడియా ప్రతినిధులు పేర్కొంటున్నారు. మీడియా ఇబ్బందులు పడుతోందని, వెంటనే అంతర్జాతీయ మీడియా సంస్థలు జోక్యం చేసుకొని, పరిస్థితిని చక్కదిద్దాలని పిలుపునిచ్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, మీడియా మొత్తానికే మూతపడే సూచనలున్నాయని ఆఫ్గన్ మీడియా ప్రతినిధులు అంటున్నారు.