మెల్బోర్న్: హిందూ మహాసముద్రంలో అమెరికా జలాంతర్గామి.. ఇరాన్ నౌకను టార్పిడోతో పేల్చివేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 87 మంది నావికులు మృతిచెందగా, సుమారు 50 మంది వరకు గాయపడ్డారు. అయితే జలాంతర్గామిలో ముగ్గురు ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నట్లు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్(PM Anthony Albanese) తెలిపారు. కానీ తమ రక్షణ దళ సిబ్బంది ఆ దాడిలో పాల్గొనలేదని ఆయన అన్నారు. శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ నౌకను అమెరికా జలాంతర్గామి తన టార్పిడోతో దాడి చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి ఓ టార్పిడోతో శుత్రు దేశ నౌకను అమెరికా పేల్చడం ఇదే మొదటిసారి.
అయితే శిక్షణలో భాగంగా ఆస్ట్రేలియా రక్షణ దళ సిబ్బంది ఆ జలాంతర్గామిలో ఉన్నట్లు ప్రధాని ఆల్బనీస్ వెల్లడించారు. ఆకస్ డిఫెన్స్ ఒప్పందంలో భాగంగా ముగ్గురు శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ మధ్య ఆకస్ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గాములను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆస్ట్రేలియాకు ఆకస్ సభ్యదేశాలు శిక్షణ ఇస్తున్నాయి. అమెరికా జలాంతర్గామిలో తమ సభ్యులు ఉన్నా.. వారేమి నేరుగా యాక్షన్లో పాల్గొనలేదని ఆల్బనీస్ అన్నారు.
అమెరికా మిత్రదేశమైన ఆస్ట్రేలియా.. ప్రస్తుతం ఇరాన్పై జరుగుతున్న సైనిక చర్యలో తన పాత్ర ఏమీలేదని పేర్కొన్నది. కానీ ఇరాన్ అణ్వాయుధాలను సమీకరించడాన్ని వ్యతిరేకించనున్నట్లు ఆస్ట్రేలియా చెప్పింది.